ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 1 నుంచి 'శాటిలైట్' టోల్ ఛార్జీల వసూలు.. కేంద్రం క్లారిటీ

business |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 10:45 PM

 శాటిలైట్ ఆధారిత టోల్ విధానం మే 1వ తేదీ నుంచే అమలవుతోందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియాలన్నీ కొత్త టోల్ ఛార్జీలపై కథనాలు ప్రచూరించాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధానమే కొనసాగుతుందని తెలిపింది. ఫాస్టాగ్ ఉండదని, టోల్ ప్లాజాలు ఎత్తి వేయనున్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియా సంస్థల వార్తలను ఖండించింది. మే 1 నుంచి శాటిలైట్ టోల్ వసూలు అమలు చేయడం లేదని నొక్కి చెప్పింది.


శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు ఎలా పని చేస్తుంది?


ఫీజు వసూలుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటో మేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్ గేట్ల వద్ద అమరుస్తారు. ఇందులో ఏఎన్‌‌పీఆర్‌తో పాటు ఫాస్టాగ్ కలిపి సేవలందిస్తాయి. అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే సదరు వాహనాలు రోడ్డుపై ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ ఛార్జీలు కట్ చేస్తారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసుల..


శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీల కోసం నంబర్ ప్లేట్లను గుర్తించే టెక్నాలజీ పని చేస్తుంది. కొత్త విధానంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు జారీ చేస్తారు. ఫాస్టాగ్ రద్దు, పెనాల్టీలు విధిస్తారు. అయితే, శాటిలైట్ టోల్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


ప్రస్తుతం జాతీయ రహదారులపై 60 కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా ఉంటుంది. ఫాస్టాగ్ ద్వారా క్షణాల వ్యవధిలో వాహనాలు టోల్ గేట్లను దాటుతున్నాయి. ఫాస్టాగ్ ఐడీ గుర్తింపుతో టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా టోల్ ప్లాజా వద్దకు వస్తే నిర్ణీత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు సాంకేతిక సమస్యల కారణంగా ఫాస్టాగ్ పని చేయకపోవడంతో టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా కేంద్రం శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని తీసుకువస్తోంది. అయితే, ఇది ఎప్పటి నుంచి అమలవుతుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa