ఢిల్లీ విమానాశ్రయంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఆయన ప్రయాణిస్తోన్న విమానాన్ని జైపూర్కు దారి మళ్లించడంపై మండిపడ్డారు. విమానం బయలుదేరిన మూడు గంటల అనంతరం దారి మళ్లించారని, ఢిల్లీ విమానాశ్రయం తీరు దారుణంగా ఉందని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. జైపూర్ నుంచి తిరిగి ఎప్పుడు బయల్దేరుతామో కూడా తెలియదని, దీని గురించి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రయాణికుల విషయంలో వారి బాధ్యతారాహిత్యం చూస్తుంటే.. సహనం నశించిపోతోందని, తాను మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేనని విరుచుకుపడ్డారు
ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యం అవుతున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలో కూడా వాతావరణం సరిగా లేకపోవడంతో చాలా విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎక్స్ (ట్విట్టర్)లో తన అసహనాన్ని వ్యక్తం చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా ‘జమ్మూ నుంచి బయలుదేరిన విమానం మూడు గంటల పాటు గాల్లోనే ఉంది.. ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీగా ఉండటం లేదా అంతరాయం వల్లనో జైపూర్కి దారి మళ్లించారు.. రాత్రి 1 గంటకు విమానం మెట్లపై నిలబడి గాలి పీల్చుకుంటున్నాను.. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు’ అని ఆయన అన్నారు.
దీని తర్వాత మరో పోస్ట్ పెట్టిన ఆయన తాను ఆదివారం ఉదయం 3:00 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నానని తెలిపారు. గత వారం రోజులుగా ఢిల్లీలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో విమానాలు ఆలస్యం అవుతున్నాయి. దీనిపై విమానాశ్రయ అధికారులు ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. గాలి దిశ మారడం వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ‘విమానాల రాకపోకలను నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం... ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం... విమాన సర్వీసుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి మీ విమానయాన సంస్థతో టచ్లో ఉండండి.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం... మీ సహకారానికి ధన్యవాదాలు’ అని అందులో పేర్కొన్నారు.
జమ్మూ విమానాశ్రయంలో కూడా ప్రతికూల వాతావరణంతో చాలా విమానాలు రద్దు చేశారు. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. రద్దీగా ఉన్న టెర్మినల్ వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాత్రికి ఉండటానికి వసతి దొరుకుతుందో లేదో అని కొందరు ఆందోళన చెందారు. దీనిపై ఇండిగో, స్పైస్జెట్ వంటి సంస్థలు ప్రకటన విడుదల చేసి.. ప్రయాణికులకు ఎదురైన అంతరాయంపై విచారం వ్యక్తం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa