దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో ఉంటుంది. ఆర్బీఐ మానీటరీ పాలసీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు సేవలందించాల్సి ఉంటుంది. అలా కాదని ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటుంది. గతేడాది నుంచి దేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన ఆర్బీఐ చాలా బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కొన్నింటికి భారీ జరిమానాలు విధించింది. తాజాగా ఇప్పుడు మరో 3 బ్యాంకులు ఆ జాబితాలో చేరిపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగ్రహానికి గురైన 3 బ్యాంకుల్లో ప్రధానంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండడం గమనార్హం. ఆ తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. రెగ్యులేటరీ నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన క్రమంలో ఆయా బ్యాంకులపై జరిమానా విధించినట్లు గత గురువారమే ఓ ప్రకటన చేసింది ఆర్బీఐ. ప్రైవేట్ రంగ దిగ్గజాల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంకు కి ఏకంగా రూ.61.4 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిపింది. లోన్ సిస్టమ్ ఫర్ డెలివరీ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్, లోన్స్ అండ్ అడ్వాన్స్లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు బ్యాంకుపై పెనాల్టీ విధించినట్లు తెలిపింది.
మరో ప్రకటనలో.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుకు రూ.38.60 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. నో యువర్ కస్టమర్ కు సంబంధించిన పలు ఆదేశాలను పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపింది. ఇక ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీగానే ఫైన్ వేసింది. బ్యాంకుల్లో కస్టమర్ సేవల విషయంలే నిబంధనలు పాటించడం లేదని గుర్తించామని, ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.29.6 లక్షల జరిమానా వేసినట్లు తెలిపింది.
రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘన, బ్యాంకు ఖాతాదారులకు అందించే సేవల్లో రాజీపడడం వంటి కారణాలతోనే పైన పేర్కొన్న 3 బ్యాంకులకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. ఆయా బ్యాంకుల బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa