ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై జగన్ స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 05:00 PM

క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణవార్త తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సంతాపాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చికి అధినేతగా విశేషమైన సేవలు అందించారని జగన్ కొనియాడారు. ఆయన హయాంలో చర్చి వ్యవస్థలో పరివర్తనాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రీస్తు విశ్వాసులపై ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు. లాటిన్ అమెరికా ప్రాంతం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ చరిత్ర సృష్టించారని జగన్ కీర్తించారు.పోప్ ఫ్రాన్సిస్ కేవలం మత పెద్దగానే కాకుండా, ఒక నిజమైన మానవతావాదిగా నిలిచారని వైఎస్ జగన్ అభివర్ణించారు. ప్రపంచ శాంతి కోసం... పేదలు, అణగారిన వర్గాల పట్ల కరుణ చూపడంలో ఆయన ఎల్లప్పుడూ ముందున్నారని కొనియాడారు. ఆయన వినయం, మానవత్వం ప్రపంచాన్ని ఎంతగానో స్పృశించాయని పేర్కొన్నారు. శాంతి, కరుణ కోసం ఆయన గొంతుక ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని తెలిపారు.పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచానికి, ముఖ్యంగా క్యాథలిక్ సమాజానికి ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa