వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏబీవీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలోని సుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలు, కోర్టులో దాఖలు చేసిన పత్రాలను తాను క్షుణ్ణంగా పరిశీలించానని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా జరిగిందని, కేసును నీరుగార్చే విధంగా దర్యాప్తు నివేదికలు రూపొందించారని ఆయన ఆరోపించారు. ఎఫ్ఐఆర్ కు, చార్జిషీట్ కు మధ్య ఎక్కడా పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో, కోర్టు అనుమతి తీసుకుని ఈ కేసును రీఓపెన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఏబీవీ అభిప్రాయపడ్డారు. కేసు పూర్తి నిజానిజాలు వెలికితీయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలోనే జిల్లా ఎస్పీని కలవనున్నట్లు ఆయన తెలిపారు.సుబ్రహ్మణ్యం కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఏబీవీ ఆవేదన వ్యక్తం చేశారు. "అధికార మదంతో, బెదిరింపులతో ఈ కుటుంబాన్ని కాకినాడ నుంచి ఇక్కడికి తరిమివేశారు. అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేసుకునే పరిస్థితి నుంచి, ఈరోజు ఈ చిన్న గ్రామంలో ఇళ్లలో పాచిపని చేసుకుని బతకాల్సిన దుస్థితికి నెట్టారు. వారి బతుకులను నాశనం చేశారు" అని ఆయన అన్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, వారికి జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి, పరిహారం అందించాలని ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa