ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా ఆమోదం తెలిపారు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 12:55 PM

విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఉర్సా క్లస్టర్స్‌కు కారుచౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు, లోకేష్‌లే సూత్రదారులని ఆరోపించారు. కనీస ప్రభుత్వ నిబంధనలను, ప్రొసీజర్‌లను కూడా పాటించకుండా భూకేటాయింపుల ఫైల్‌ను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.అయన మాట్లాడుతూ.... ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.10 లక్షల మాత్రమే. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి ఈ సంస్థకు డైరెక్టర్‌లుగా ఉన్నారు. రెగ్యులేటరీ పర్మీషన్ల కోసం హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలో ఒక అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ విశాఖలో రూ. 5728 కోట్లతో డేటా సెంటర్‌ను ప్రారంభిస్తామని ముందుకు వచ్చింది. గతంలో ఈ సంస్థకు ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేసిన అనుభవం లేదు. వారికి కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రభుత్వ పరమైన అన్ని ఆమోదాలను ఇచ్చేసింది. కాపులుప్పాడులో రూ.3వేల కోట్ల విలువైన 56 ఎకరాల భూమిని ఎకర 99 పైసలకు కేటాయించింది.ఏదైనా సంస్థకు భూ కేటాయింపులు చేసే సమయంలో కొన్ని ప్రొసీజర్‌లు ఉంటాయి. సదరు సంస్థ ఇలా తాము రాష్ట్రంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తామని ప్రతిపాదనలతో వస్తే, దానికి సంబంధించిన అన్ని అంశాలను, అర్హతలు, అనుభవం, సామర్థ్యం తదితర విషయాలను పరిశీలిస్తారు. ఆ తరువాత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తరువాత సీనియర్ ఐఎఎస్ అధికారులతో కూడిన ఎస్ఐపీసి చర్చిస్తుంది. సాధ్యాసాధ్యాలను సమీక్షించి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎస్‌ఐపీబీకి నివేదిస్తుంది. దీనిలో పలువురు మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఉంటారు. ఈ బోర్డ్‌లో కూడా సదరు సంస్థపై చర్చించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ రెండు నెలల కిందట స్థాపించిన ఉర్సా క్లస్టర్స్ సంస్థకు ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీలు వెంటనే ఆమోదం తెలపడం, తరువాత కేబినెట్‌కు పంపడం, అక్కడ కూడా ఆమోదం పొందడం కూడా చకచకా  జరిగిపోయింది. ప్రభుత్వ ప్రోసీజర్లను ఉర్సాకు భూకేటాయింపుల్లో అపహాస్యం చేశారు. సీఎం, సంబంధిత మంత్రి లోకేష్ ప్రోత్సాహం లేకుండా ఒక ఫైల్ ఇంత వేగంగా క్లియర్ అవుతుందా? ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా ఆమోదం తెలిపారు? ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు అయిదు వేల కోట్లు ఎలా తీసుకురాగలరు, వీరిని నమ్మి ఎలా వేల కోట్ల భూములు వారికి ఇచ్చేందుకు సిద్దమయ్యారు? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa