ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ పర్యటన రద్దు కావడంతో పహల్గామ్‌లో ఉగ్రవాదుల మారణహోమం

national |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 08:00 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈనెల 18వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించాల్సి ఉండగా.. ఆ టూర్ రద్దు అయింది. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో పర్యటించి.. కత్రా నుంచి శ్రీనగర్‌ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని కూడా సందర్శించాలని ప్రధాని టూర్ షెడ్యూల్‌లో చేర్చారు. అయితే ఆ పర్యటన ఆకస్మికంగా రద్దు అయింది. ఏప్రిల్ 18, 19వ తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 18, 19వ తేదీల్లో అక్కడ భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశాలు ఉన్నాయన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రధాని మోదీ టూర్ రద్దు చేశారు.


అయితే తాజాగా అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌ సమీపంలోని బైసరన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం ముష్కరులు.. సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల మారణ హోమంలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పలువురు విదేశీ పర్యాటకులు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. బైసరన్ లోయ అందాలను, అక్కడి ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చిన టూరిస్ట్‌లు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే మొదటగా ఉగ్రవాదులు దాడి చేయాలని ప్లాన్ చేసింది ఈ బైసరన్ లోయ గురించి కాదని తాజాగా తేలింది.


 ప్రధాని మోదీ కత్రా టూర్ సందర్భంగానే ఉగ్రవాదులు ఈ దాడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అక్కడ అలజడి సృష్టించాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. అయితే చివరి నిమిషంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని పర్యటన వాయిదా పడటంతో ఉగ్రవాదులకు ఏం చేయాలో తోచలేదు. దీంతో ప్రధాని టూర్‌లో చేయాల్సిన ఉగ్రదాడి కాస్తా.. మరో ప్రాంతానికి మార్చారు. అప్పుడే మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే.. బైసరన్ లోయపై ఉగ్రవాదుల కన్ను పడింది. ఈ క్రమంలోనే పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చి మరీ.. ఆర్మీ బట్టల్లో తుపాకులతో వచ్చి దాడికి తెగబడ్డారు.


ఇక ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కమాండర్ ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గా్మ్ ఉగ్రదాడికి ఖలీద్ మాస్టర్ మైండ్ అని సమచారం. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన ఖలీద్ ప్రస్తుతం లష్కరే తోయిబా పెషావర్ హెడ్ క్వార్టర్స్‌కు చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా మిల్లీ ముస్లిం లీగ్ సంస్థకు అధ్యక్షుడిగానూ ఉన్నాడు. అయితే ఐఎస్ఐ, పాక్ ఆర్మీతోనూ ఖలీద్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. పాక్ ఆర్మీలో పని చేసిన ఆసిఫ్ ఫౌజీ అనే వ్యక్తిని ఉగ్రవాదుల బృందానికి నాయకుడిగా ఖలీద్ నియమించినట్లు తెలుస్తోంది. ఈ ఆసిఫ్ ఫౌజీ నేతృత్వంలో పీఓకేకు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో ఈ దాడికి పాల్పడ్డట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa