జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి స్పందించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూనే.. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులను వదిలి పెట్టమని చెప్పారు. అతి త్వరలోనే వారికి గట్టిగా బదులిస్తామంటూ పేర్కొన్నారు. అలాగే బాధితులకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం మారణహోమం సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తులు ధరించి పర్యటకులను చుట్టుముట్టారు. పేర్లు అడుగుతూ.. వారి ఐడీ కార్డులు కూడా చెక్ చేస్తూ మరీ హత్యలకు పాల్పడ్డారు. ఇలా మొత్తంగా 28 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. అయితే కాల్పుల అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోయారు. విషయం తెలుసుకున్న భారత బలగాలు రంగంలోకి దిగి క్షతగాత్రులకు సాయం చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని.. కుట్ర పన్నిన వారిని బయటకు లాగుతామన్నారు. ఆ తర్వాత వారికి గట్టిగా బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూనే.. ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడమే భారత్ లక్ష్యం అని చెప్పారు. అలాగే ఉగ్రవాదులను ఎదుర్కునే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు, క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీనగర్లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేత్ త్రిపాఠితో చర్చలు జరిపిన తర్వాతే కేంద్ర మంత్రి ఈ కామెంట్లు చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa