ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రదాడికి నిరసనగా..: తొలిసారి లోయ బంద్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 09:49 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తులు ధరించి వచ్చిన ముష్కరులు పర్యటకులపై విచ్చలవిడిగా కాల్పులు జరపగా.. 28 మంది చనిపోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర విచారం వ్యక్తం చేస్తుండగా.. కశ్మీరి ప్రజలు సైతం దాడికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఉగ్రవాదులు దాడులు ఆపాలంటూ ర్యాలీలు సైతం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే 35 ఏళ్లలో ఎప్పుడూ బంద్ పాటించని కశ్మీరి లోయ ప్రజలు సైతం తొలిసారిగా గురువారం రోజు బంద్ నిర్వహించారు. మరోవైపు అక్కడి వార్తా పత్రికలు కూడా.. తమ న్యూస్ పేపర్లలోని ఫ్రంట్ పేజీలను బ్లాక్ కలర్‌తో ప్రచురించాయి. ఆపూర్తి వివరాలు మీకోసం.


పహల్గాంలో పర్యటకుల హత్యలకు నిరసనగా కశ్మీరి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు మద్దతు ఇవ్వడంతో.. 35 ఏళ్లలో తొలి సారి కశ్మీర్ లోయ పూర్తిగా బంద్ పాటించిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీనగర్‌లోని చాలా దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, ఇతర వ్యాపార సంస్థలు మూసే ఉన్నాయని చెప్పారు. అయితే నగరం అంతటా అత్యవసర వస్తువులు విక్రయించే కొన్ని దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయని వెల్లడించారు. స్వచ్ఛందంగానే బంద్ పాటించడంతో.. ప్రజా రవాణా కూడా చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారగా.. అక్కడక్కడా భారత బలగాలు, పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారని పేర్కొన్నారు.


అలాగే ప్రైవేటు బడులను సైతం స్వచ్ఛందంగానే మూసేశారని అధికారులు వెల్లడించారు. ఈ బంద్ ప్రభావం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలపై పడినట్లు చెప్పారు. JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునివ్వగా... నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఇతర రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. మరోవైపు లోయలోని అనేక చోట్ల కశ్మీరి ప్రజలు ఉగ్రదాడిని నిరసిస్తూ.. శాంతియుత నిరసన చేపట్టారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కశ్మీర్‌లో ప్రచురించే అన్ని పత్రికా ఆఫీసులు ఏక కంఠంతో ఉగ్రదాడిని ఖండించాయి. ఇంగ్లీష్, ఉర్దూలో ప్రతిరోజూ వచ్చే పత్రికలు తమ ఫ్రంట్ పేజీలను నలుపు రంగుతో పబ్లిష్ చేశాయి. వాటిలో తెలుపు రంగు అక్షరాలతో వార్తలను రాశారు.


గ్రేటర్ కశ్మీర్, రైజింగ్ కశ్మీర్, కశ్మీర్ ఉజ్మా, అఫ్తాబ్, తమీల్ ఇస్రాడ్ పత్రికలు సాంప్రదాయానికి వ్యతిరేకంగా తమ ఫ్రంట్ పేజీలను ప్రచురించాయి. ముఖ్యంగా మొదటి పేజీలను నలుపు రంగుతో పబ్లిష్ చేసిన ఈ పత్రికలు.. ఎడిటోరియల్ పేజీలను తెలుపు, ఎరుపు రంగులో ప్రచురించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa