జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అక్కడి భయానక పరిస్థితులు దేశం మొత్తం కళ్లకు కట్టినట్లు చూసింది. ఇక బాధితులు, వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. అయితే ఓ వైపు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరుపుతుంటే.. ఓ స్థానికుడు మాత్రం తెగువ చూపించాడు. ప్రాణాలకు తెగించి.. వారిని అడ్డుకునేందుకు, వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అతడిపై ఆ ఉగ్రవాదులు దాడి చేయడంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
పహల్గామ్ నుంచి బైసరన్ లోయకు చేరుకోవాలంటే రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి కాలినడక, మరొకటి గుర్రాలపై వెళ్లడం. అయితే మంగళవారం మధ్యాహ్నం బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో.. వారిని కాపాడేందుకు హార్స్ రైడర్ సయ్యద్ అదిల్ హుస్సేన్ షా గొప్ప పోరాటం చేశాడు. టూరిస్ట్లపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండగా.. అది గమనించిన సయ్యద్ అదిల్ హుస్సేన్ షా.. వారిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. వారినుంచి తుపాకీ లాగేసుకునేందుకు ప్రయత్నించాడంతో ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అదిల్ హుస్సేన్ షా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పహల్గామ్ నుంచి సముద్రమట్టానికి 3 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలంటే బైసరన్ పచ్చిక బయళ్ల మీదుగా వెళ్లాల్సిందే. అయితే ఇక్కడికి నడక, గుర్రపుస్వారీ మాత్రమే ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ చేసేవారు అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఉంటారు. అలాంటి సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే పహల్గామ్కు వచ్చిన పర్యాటకులను అక్కడి నుంచి బైసరన్ లోయ వద్దకు సయ్యద్ అదిల్ హుస్సేన్ షా తన గుర్రంపై తీసుకువెళ్లాడు. అదే సమయంలో ఈ ఘటన జరగడంతో.. పర్యాటకులను కాపాడే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు.. అనంతనాగ్కు చెందిన సయ్యద్ అదిల్ హుస్సేన్ షా మరణంతో అతని కుటుంబం ఇప్పుడు దిక్కులేని స్థితిలోకి చేరింది. అదిల్పైనే ఆధారపడి అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో వారు అనాథలయ్యారు. ఈ ఘటనపై స్పందించిన అదిల్ తండ్రి సయ్యద్ హుస్సేన్ షా.. రోజూ లాగే మంగళవారం కూడా తన కుమారుడు పనికి వెళ్లాడని.. అయితే ఈ ఉగ్రదాడి జరిగినట్లు మధ్యాహ్నం 3 గంటలకు సమాచారం అందినట్లు చెప్పారు. అప్పుడు అదిల్కు ఫోన్ చేయగా.. కలవలేదని.. దీంతో తాము దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమకు ఇప్పుడు న్యాయం కావాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక అదిల్ హుస్సేన్ షా మరణంపై అతని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమ కుటుంబం మొత్తానికి తన కుమారుడు ఒక్కడే సంపాదించి తీసుకువస్తాడని.. అలాంటిది అతడే ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో.. తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa