లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ రేపు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారిని ఆయన పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతనాగ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి తెలియగానే తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని హుటాహుటిన భారత్కు తిరిగి వచ్చారు. ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆయన కశ్మీర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నిఘా సంస్థల అధికారులు పాల్గొని, పహల్గామ్ దాడి పరిణామాలపై నేతలకు వివరించారు. సమావేశం అనంతరం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఈ దాడిని ఖండించాయి. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇస్తాయి" అని తెలిపారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర, జిల్లా శాఖలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలిపాయి.ఇదే సమయంలో, ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన 'సంవిధాన్ బచావో' కార్యక్రమాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa