వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకు ఎదురుదెబ్బ తగిలింది. రేణుక దంపతులు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నుంచి 2018లో 15 ఏళ్ల కాలవ్యవధిలో తీసుకున్న రూ.310 కోట్ల అప్పు తిరిగి చెల్లించలేదు.. దీంతో వారి ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. వీరు ఐదేళ్ల నుంచి కిస్తీలు కట్టడం లేదు.. దీంతో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారులు వేలం వేయడానికి సిద్ధమయ్యారు.
బుట్టా రేణుక దంపతులు బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కోసం రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే కొంతకాలం రుణానికి సంబంధించిన కిస్తీలు కట్టారు. ఆ తర్వాత ఆ డబ్బులు చెల్లించలేదు. దాదాపు రూ.40 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తుండగా.. ఇంకా అసలు, వడ్డీ కలిపి రూ.340 కోట్లు కట్టాల్సి ఉందని సమాచారం. ఈ మేరకు వడ్డీ భారం ఎక్కువ కావడంతో ఆస్తులు అమ్మి రుణం రీషెడ్యూల్ చేయమని కోరారు.. కానీ హెచ్ఎఫ్ఎల్ అధికారులు ఒప్పుకోలేదు. ప్రతి నెలా రూ.3.40 కోట్ల చొప్పున చెల్లించాలని అధికారులు చెప్పారు. అయితే, మొదట తక్కువ మొత్తం చెల్లించి ఆ తర్వాత పెంచుతామని బుట్టా రేణుక దంపతులు కోరారు. దీనికి కూడా హెచ్ఎఫ్ఎల్ అంగీకరించలేదు. రుణం చెల్లించకపోవడంతో హెచ్ఎఫ్ఎల్ ఎన్సీఎల్టీని ఆశ్రయించగా.. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది.
రుణ నిబంధనల ప్రకారం బంజారాహిల్స్లో బుట్టా రేణుకకు సంబంధించి ఉన్న ఐదువేల గజాల స్థలాన్ని వేలం వేయాలని చూశారు. దాని విలువ రూ.145 కోట్లు. కానీ, ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అలాగే మాదాపూర్లోని 7,205 చదరపు గజాల స్థలంలో ఉన్న బుట్టా కన్వెన్షన్ను కూడా వేలం వేయాలని చూశారు. దీనికి కూడా స్పందన రాలేదు. మళ్లీ వేలం వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వేలంలో పాల్గొంటే సమస్యలు వస్తాయేమోనని చాలామంది భయపడుతున్నట్లు తెలుస్తోంది. వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో అధికారులు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ వేలం వ్యవహారానికి సంబంధించిన అంశంపై బుట్టా రేణుక స్పందించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa