ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్‌లో బయటపడ్డ ఉగ్రవాద స్థావరం

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 07:59 PM

భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌పై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మరోవైపు.. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియను భారత సైన్యం ముమ్మరంగా చేపట్టింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రస్థావరం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.


పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత.. ఉగ్రవాదుల ఏరివేతను ఇండియన్ ఆర్మీ పకడ్బందీగా చేపడుతోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేసిన భారత ఆర్మీ.. రాష్ట్ర వ్యాప్తంగా నక్కి ఉన్న ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ చేపడుతోంది. దొరికిన వారిని దొరికినట్లే ఎన్‌కౌంటర్ చేస్తోంది. ఉగ్రదాడి తర్వాత అలుపెరుగకుండా భద్రతా బలగాలు.. జమ్మూ కాశ్మీర్‌లో వేట కొనసాగిస్తున్నాయి. తాజాగా కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్‌లో ఉన్న రహస్య ఉగ్రవాదుల స్థావరాలను భద్రతా దళాలు గుర్తించి.. మెరుపు దాడి చేశాయి. ఇందులో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.


నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో శనివారం పోలీసులతో కలిసి భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. క్యాంప్ మాచిల్, భారత సైన్యంలోని 12 సిఖ్లి యూనిట్, కుప్వారా పోలీసులు, మాచిల్ పోలీస్ పోస్ట్ పరిధిలోని సెడోరి నాలా, ముష్టకాబాద్ మాచిల్ అటవీ ప్రాంతంలో సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మెరుపు దాడితో ఉగ్రవాదులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉన్న రహస్య ఉగ్రస్థావరాన్ని భద్రతా దళాలు విజయవంతంగా గుర్తించి పూర్తిగా నాశనం చేశాయి.


దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మారణ హోమం సృష్టించడానికి ఉగ్రవాదులు ఎంత సిద్ధంగా ఉన్నారో అక్కడ దొరికిన ఆయుధాలు, ఇతర సామాగ్రి చూస్తే అర్థమవుతుంది. ఆ ఉగ్ర స్థావరంలో 5 ఏకే-47 రైఫిళ్లు, 8 ఏకే -47 మ్యాగజైన్‌లు, 1 పిస్టల్, భారీగా మందుగుండు సామగ్రితో పాటు ఇతర ప్రమాదకరమైన ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌తో ఇండియన్ ఆర్మీ భారీ విజయాన్ని సాధించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్రకు తెరలేపారని అనుమానిస్తున్నారు. అయితే భద్రతా దళాల సకాలంలో స్పందించి.. వారి ప్లాన్‌ను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు.. సెర్చ్ ఆపరేషన్, ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత కట్టుదిట్టం చేశాయి. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గత 48 గంటల్లోనే 175 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిపైనా భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో షోపియన్‌కు చెందిన ఉగ్రవాది షాహిద్ అహ్మద్ కుటి, పుల్వామాకు చెందిన హరిస్ అహ్మద్ (రెండు ఇళ్లు), త్రాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్, అనంత్‌నాగ్‌కు చెందిన ఆదిల్ థోకర్, కుల్గామ్‌కు చెందిన జాకీర్ అహ్మద్ గనాయ్ ఇళ్లు ఉన్నాయి. అంతే కాకుండా భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాయి. దీంతో జమ్మూ కాశ్మీర్‌లో నక్కి ఉన్న ఉగ్రమూకలు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa