భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల మీడియా, సోషల్ మీడియా.. కొంత సంయమనం పాటించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సూచించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. రక్షణ సంబంధిత వార్తల కవరేజ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు కేవలం మీడియాకే కాకుండా సోషల్ మీడియా నెటిజన్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వేళ.. ప్రభుత్వం రక్షణ పరంగా చేపడుతున్న కీలకమైన చర్యలను కవర్ చేసే విషయంలో అత్యుత్సాహం చూపవద్దని తేల్చి చెప్పింది. మరీ ముఖ్యంగా రక్షణ చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో "జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ఫారమ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా యూజర్లు రక్షణ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు" అని స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలక, వ్యూహాత్మక సమాచారం శత్రువులకు తెలిసే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అధికారులకు, ప్రభుత్వానికి సమస్యలు తీసుకువచ్చే అవకాశమే కాకుండా.. దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల చర్యలకు సంబంధించిన వార్తలను ప్రేక్షకులకు, పాఠకులకు అందించే సమయంలో మీడియా సంస్థలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, రూల్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రత్యేకంగా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన రియల్-టైమ్ కవరేజ్, వీడియోల ప్రసారం, సైన్యం కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని తేల్చి చెప్పింది. సున్నితమైన సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేయడం వల్ల.. అది కాస్తా శత్రువులకు సహాయం చేసినట్టే అవుతుందని.. ఇలా చేయడం వల్ల దేశ ప్రణాళికల అమలులో ఇబ్బందులు కలిగించడమే కాకుండా సైన్యం భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొంది.
గతంలో కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడుల వంటి ఘటనల సమయంలో బాధ్యతారహితమైన న్యూస్ కవరేజ్ వల్ల ఎదురైన సమస్యలను ఈ సందర్భంగా కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఇష్టం వచ్చినట్లుగా న్యూస్ కవర్ చేయడం వల్ల జాతీయ ప్రయోజనాలపై ఊహించని ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై దాడులు, కాందహార్ విమానం హైజాక్ వంటి ఘటనల సమయంలో జరిగిన ఘటనలు గుర్తుంచుకోవాలని హితవు పలికింది. రాబోయే రోజుల్లో మీడియా, సోషల్ మీడియా ఈ సూచనలను తప్పక పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa