తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్తో పాటుగా వేసవి సెలవులు కూడా కావటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల తాకిడి పెరిగింది. అలాగే సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చే భక్తులతో శ్రీవారిమెట్టు మార్గంలోనూ రద్దీ నెలకొంటోంది. సర్వదర్శనం టోకెన్ల కోసం శ్రీవారిమెట్టు వద్ద భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. అలాగే అలిపిరి చెక్ పోస్టు వద్ద కొండపైకి వెళ్లే వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల వరకూ సమయం పడుతోంది.
మరోవైపు వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో వీఐపీ, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలను రద్దు చేశారనే వార్తలు వచ్చాయి. మే, జూన్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు ఇబ్బందులు పడకూడడనే ఉద్దేశంతోనే ఈ రెండు నెలలు వీఐపీ దర్శనాలతో పాటుగా సిఫార్సు లేఖలపై శ్రీవారి సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వీటిపై క్లారిటీ ఇచ్చారు.
ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి అనుమతి యథాతథంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బోర్డు సభ్యులు ఇచ్చే సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. మే, జూన్ నెలలలో శ్రీవారి దర్శనానికి గానూ ముందుగా సిఫార్సు లేఖలు తీసుకున్న భక్తులకు దర్శనాలు యథాతథంగా ఉంటాయని జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో తిరుమలలో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబ్స్క్వాడ్ బృందాలు తిరుమలలో తనిఖీలు చేపట్టాయి. శనివారం రోజున జీఎన్సీ టోల్గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గం ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, భక్తుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. మేదరమిట్ట, రాంభగీచా గెస్ట్ హౌస్, పార్కింగ్ ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్ ద్వారా సోదాలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో ముష్కర మూకలు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది వరకూ చనిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa