ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటెయినర్లో అంగన్వాడీ కేంద్రం,,,కూటమి ప్రభుత్వం నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 08:44 PM

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. రెండు కష్టమైన పనులే. సంబంధం కుదిరి.. అన్ని రెడీగా ఉంటే పెళ్లి త్వరగా అవుతుందేమో కానీ.. ఇల్లు పూర్తవ్వాలంటే కనీసంలో కనీసం 6 నెలలు అయినా పడుతుంది. అయితే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కొద్ది నిర్మాణ రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలో నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఇల్లు అంటే ఒకరి వ్యక్తిగత విషయం కనుక.. నచ్చినంత సమయం తీసుకుని.. నచ్చినట్లు కట్టుకుంటారు. కానీ జనాలకు అవసరమైన భవనాలు అంటే ఆస్పత్రులు, పాఠశాల భవనాల విషయానికి వస్తే.. త్వరగా పూర్తి చేయాలని భావిస్తారు. కంటెయినర్లు అందుబాటులోకి రావడంతో.. ఇప్పుడిలాంటి అత్యవసర భవనాలు త్వరగా పూర్తవుతున్నాయి. తాజాగా ఏపీలో కంటెయినర్ అంగన్వాడీ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..


సాధారణంగా బిల్డింగ్ కట్టాలంటే నెలల సమయం పడుతుంది. అదే ఇంకా మన్యం గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోని కూటమి ప్రభుత్వం కంటెయినర్లను వాడుకలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలోని పలుగ్రామాల్లో.. కంటెయినర్లలో ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చోట కూడా ఇలాంటి ప్రయోగానికి రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా జిల్లాలోని నర్సిపురం, భామినిలోని అంగన్‌వాడీ కేంద్రాల కోసం కంటెయినర్లను సిద్ధం చేశారు. రెండు గదులు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న కంటెయినర్లను పలు గ్రామాల్లో.. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారుగా రూ.10 లక్షలు ఖర్చు అవుతోందని సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు.


పక్కా భవనంతో పోల్చుకుంటే.. కంటెయినర్ జీవితకాలం తక్కువే. కాకపోతే అత్యవసరంగా కావాలంటే మాత్రం కంటెయినర్లను వాడవచ్చు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కంటెయినర్ గదులు, కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు కంటెయినర్ల వాడకానికి ఓటు వేస్తున్నాయి. వీటిల్లో ఆఫీసు గదులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇళ్ల విషయానికి వస్తే మాత్రం.. పక్కా భవనాలకే ఓటు వేస్తున్నారు. ఇక తాజాగా జపాన్‌లో కేవలం ఆరు గంటల వ్యవధిలోనే త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. అరిడా నగరంలోని హట్సుషీమా స్టేషన్‌ పురాతన భవనం స్థానంలో ఈ కొత్త త్రీడీ ప్రింటెడ్ స్టేషన్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa