పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే డిమాండ్ వెల్లువెత్తుతోంది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులు పదే పదే భారత్లో దాడులకు తెగబడుతుండటానికి ఫుల్స్టాప్ పెట్టాలంటే వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిందేనని పేర్కొంటున్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి మద్దతు తెలుపుతామని తేల్చి చెప్పాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. ఇప్పుడు అవే వ్యాఖ్యలు పాక్ మీడియాలో హెడ్లైన్గా మారుతున్నాయి. దీంతో బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది.
భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఆ వ్యవహారంపై స్పందించిన సిద్ధరామయ్య.. పాకిస్తాన్తో యుద్ధం వద్దని, యుద్ధానికి తాను అనుకూలం కాదని పేర్కొన్నారు. దీంతో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా సంస్థలు హైలెట్ చేస్తూ కథలు కథలుగా వార్తా కథనాలను నివేదించింది. యుద్ధం వద్దని.. భారత్కు చెందిన నేతలే పేర్కొంటున్నారంటూ పాక్ మీడియా పేర్కొంది. దీంతో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సిద్ధరామయ్యను ‘‘పాకిస్తాన్ రత్న’’ అంటూ వ్యాఖ్యానించింది.
ఇక తాను చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదని తాను ఎప్పుడూ చెప్పలేదని.. యుద్ధం పరిష్కారం కాదని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్నారు. పర్యాటకులకు రక్షణ ఇవ్వాలని.. ఇది ఎవరి బాధ్యత అని.. వైఫల్యం జరిగిందని మాత్రమే తాను చెప్పినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని.. టూరిస్ట్లకు కేంద్ర ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదని పేర్కొన్నారు. యుద్ధం విషయానికి వస్తే.. అది అనివార్యమైతే మనం యుద్ధానికి వెళ్లాలని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రముఖ వార్తా సంస్థ జియో న్యూస్ సహా చాలా మీడియా సంస్థలు వార్తలుగా కవర్ చేశాయి. యుద్ధానికి వ్యతిరేకంగా భారత్లో స్వరాలు వినిపిస్తున్నారని పాక్ మీడియా వెల్లడించింది. ఇక సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. జియో న్యూస్ బులెటిన్ నుంచి ఓ వీడియో క్లిప్ను కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఎక్స్లో ట్వీట్ చేశారు.
‘‘సరిహద్దుకు బయటి నుంచి వజర్-ఎ-లా సిద్ధరామయ్యకు భారీ శుభాకాంక్షలు. సిద్ధరామయ్యపై పాక్ మీడియా ప్రశంసలు గుప్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో యుద్ధానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ, ప్రజలు నిరాశ చెందారు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa