ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్ దాడి.. కశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:12 PM

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైన్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో దాడికి ఉగ్రవాదులకు సహాకారం అందించినవారి మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది. స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం ధ్వంసం చేస్తోంది. శనివారం రాత్రి మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు. దీంతో శుక్రవారం నుంచి ఇప్పటి వరకూ మొత్తం తొమ్మిది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసినట్టయ్యింది. మొత్తం 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. భారీ ఎత్తున ఆయుధాలు డంప్ శనివారం బయటపడింది. భద్రతా అధికారుల సమాచారం ప్రకారం.. బందిపోరా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను కూల్చివేశారు. షోపియాన్ జిల్లాలో గతేడాది ఉగ్రవాద సంస్థలో చేరిన అద్నాన్ షఫీ నివాసాన్ని శనివారం రాత్రి వండినా గ్రామంలో కూల్చివేసినట్టు తెలిపారు.


పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ తడ్వా ఇంటిని ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని కలరూస్ ప్రాంతంలో అధికారులు బాంబులతో పేల్చేశారు. పుల్వామాలో క్రియాశీల ఉగ్రవాది ఆమీర్ నజీర్ ఇంటిని ధ్వంసం చేశారు. బందిపోరాలో 2016 నుంచి ఉగ్ర కార్యకలాపాల్లో చురకుగా ఉన్న లష్కరే తొయిబా (LeT) ఉగ్రవాది జమీల్ అహ్మద్ షేర్గోజ్రీ ఇంటిని భద్రతా దళాలు కూల్చేశాయి. గత 48 గంటల్లో ఉగ్రవాదులు లేదా వారి సహాయకులతో సంబంధం ఉన్న ఆరుగురు ఇళ్లను ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై ఇంకా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


ఉగ్రవాదుల ట్రాప్ నుంచి త్రుటిలో తప్పించుకున్న సైన్యం


ఇతర కూల్చివేతలు:


కుల్గాం జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాల్లో 2023 నుంచి చురుకుగా ఉన్న జకీర్ అహ్మద్ గనీ ఇంటిని కూల్చివేశారు. షోపియాన్ జిల్లాలో చొటిపోరాలో లష్కరే తొయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టయ్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అధికారుల ప్రకారం.. చుట్టుపక్కల ఇళ్లకు నష్టం జరగకుండా నియంత్రిత విధానంలో కూల్చివేతలు నిర్వహించారు.


గురువారం రాత్రి అదిల్ హుస్సేన్ థోకర్ అలియాస్ అదిల్ గూరీ, అవంతిపోరాలో ఆసిఫ్ షేక్, పుల్వామాలో అహ్సాన్ షేక్ ఇళ్లను కూడా భద్రతా దళాలు కూల్చాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, అదిల్ థోకర్ 2018లో పాకిస్థాన్‌కు స్టూడెంట్ వీసాపై వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందాడు. గత సంవత్సరం తిరిగి వచ్చి పహల్గామ్ దాడిలో పాకిస్థానీ ఉగ్రవాదులకు సహాయం చేశాడు.


శుక్రవారం బందిపోరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్, హఫీజ్ సయీద్ అనుచరుడు అల్తాఫ్ లల్లి హతమయ్యాడు. ఈ సమయంలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు కానీ ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com