ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు పాక్ మినిస్టర్ హెచ్చరిక.. 130 అణు బాంబులు ఎక్కుపెట్టి ఉన్నాయి

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:11 PM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సరిహద్దుల్లో ఏక్షణంలో అయినా యుద్ధం రావచ్చు అనేలా ఉంది వాతావరణం ఇలాంటి పరిస్థితుల్లో పాక్ నేతలు తమ నోటి దురుసుతో మరింత ఉద్రిక్తత రాజేస్తున్నారు. ఇక తాజాగా పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు భారత్‌పై న్యూక్లియర్ బాంబులతో దాడి చేస్తామని.. బహిరంగంగా హెచ్చరించారు. 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ కేవలం ఇండియా కోసమే వేచి ఉన్నాయన్నారు.


పాకిస్థాన్ మినిస్టర్ హనిఫ్ అబ్బాసి భారత్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ వద్ద ఘొరి, షాహీన్, ఘజ్నావి వంటి మిస్సైల్స్‌తో పాటుగా.. 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని.. అవన్ని కేవలం భారత్ కోసమే ఎక్కుపెట్టామని చెప్పుకొచ్చారు. అంతేకాక భారత్ కనుక సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి.. నీటి సరఫరాను అడ్డుకుంటే.. అప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు. పాక్ అణ్వాయుధాలను వాడుతుందని.. రహస్యంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వాటిని దాచి ఉంచామని.. భారత్ రెచ్చెగొట్టే చర్యలకు పాల్పడితే.. వాటిని ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి.. కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదని.. వాటన్నింటిని భారత్‌వైపు సంధించి పెట్టామని హనిఫ్ అబ్బాసి చెప్పుకొచ్చారు.


పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్.. పాక్‌పై చర్యలకు సిద్ధమైంది. దానిలో భాగంగా 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాటుగా భారత్‌లో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేసింది. అలానే పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది.ఇక భారత్ చర్యలకు బదులుగా పాకిస్తాన్ భారతీయ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా బ్యాన్ చేసింది. దీనిపై హనిఫ్ స్పందిస్తూ.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే.. భారత విమానయానరంగంలో ఆందోళనలు మొదలవుతాయి. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియాలోని విమానాయాన సంస్థలు దివాళా తీస్తాయి అని చెప్పుకొచ్చారు.


అంతేకాక పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్‌ను నిందించడం సరికాదన్నారు హనిఫ్ అబ్బాసి. భారత్ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. భారత్ నిర్ణయాలకు కౌంటర్ ఇచ్చేందుకు పాకిస్థాన్ కూడా సిద్ధంగా ఉందని.. పాక్ ఎలాంటి చర్యలకైనా వెనకాడదని వెల్లడించారు. ఇక రెండు రోజుల క్రితం పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ.. అమెరికా, పశ్చిమ దేశాల కోసం పాకిస్థాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మద్దతుగా ఉందని తెలుపుకొచ్చాడు. అమెరికా, పశ్చిమ దేశాల కోసం తాము ఆ నీచానికి పాల్పడినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com