ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్ కోసం భారత్, పాక్‌లు 1500 ఏళ్లుగా కొట్టుకుంటున్నాయా,,,,ట్రంప్‌కి మతిభ్రమించిందా?

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:07 PM

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకున్న ఉద్రిక్తతల వేళ.. కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు 1,000 లేదా 1,500 సంవత్సరాలుగా కశ్మీర్ కోసం కొట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం వాటికన్‌కు వెళ్లే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ... భారత్, పాక్ సంబంధాల గురించి ఆయన స్పందించారు. భారత్‌తోనూ, పాకిస్థాన్‌తోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కశ్మీర్ సమస్యకు రెండు దేశాలు ఏదో ఒక పరిష్కారం కనుగొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరమని ఆయన అన్నారు.


ట్రంప్ వ్యాఖ్యల మర్మమేంటో?


కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఆయన చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు’ అని.. ‘కశ్మీర్ వివాదం గురించి ఆయనకే బాగా తెలుసు’ పలువురు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ‘వివిధ కాలాల్లో భూభాగాల పేర్లు మారినా, అదే ప్రాంతంపై గిరిజన యుద్ధాలు 8వ శతాబ్దం నుంచే ఉన్నాయి. మంచి ప్రయత్నం’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.


కొందరు విశ్లేషకులు ఆయన వ్యాఖ్యలను.. నేరుగా అమెరికా జోక్యం లేకుండానే భారత్, పాకిస్థాన్‌లు కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నంగా చూస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం, ట్రంప్ వ్యాఖ్యలు భారత్ తన భద్రతా ఆందోళనలను పరిష్కరించేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా భావించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కశ్మీర్ వివాదంపై తాను మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను భారత్ తిరస్కరించింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఎవరి జోక్యం అవసరమ లేదని తేల్చిచెప్పింది.


కానీ, కశ్మీర్ అంశాన్ని 1000-1,500 ఏళ్ల నాటి సంఘర్షణగా ట్రంప్ చిత్రీకరించిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, భారత్, పాకిస్థాన్‌లు అనే ఆధునిక దేశాలు 1947లో బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మాత్రమే ఏర్పడ్డాయి. దేశ విభజన జరిగి 75 ఏళ్లు అయ్యింది. ఆ సమయంలోనే కశ్మీర్ వివాదం మొదలైంది. ఈ లెక్కన కశ్మీర్ సమస్య మొదలై 75 ఏళ్లు అవుతుంది. మరి ట్రంప్ ఏ ప్రాతిపదిక 1000-1,500 ఏళ్లు అంటున్నారు. ఆయన చెప్పినట్టే కశ్మీర్ సమస్య 1,500 ఏళ్లుగా ఉందని అనుకుందాం.. మరి భారత్‌లోకి అరబ్బులు అడుగుపెట్టిందే క్రీ.శ 712లో. అంటే, అప్పుడే కశ్మీర్ వివాదం మొదలైందా? ఆయన ఏ ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేశారో? ట్రంప్‌నకే ఎరుక.


అరబ్బుల దండయాత్ర


ఇది భారత ఉపఖండ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. క్రీ.శ 8వ శతాబ్దంలో (712 సంవత్సరం), ఖలీఫా అల్-వలీద్ ఆదేశాలతో అరబ్బు సైన్యానికి చెందిన యువ సేనాధిపతి ముహమ్మద్ బిన్ కాసిమ్ సింధు దేశంపై దండయాత్ర చేశాడు. సింధు ప్రాంతంలో ఉన్న హిందూ రాజులు అరబ్బు వ్యాపార నౌకలను దోచుకున్నారని ఆరోపణ, వ్యాపార మార్గాలను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశం, ఇస్లాం మతవ్యాప్తి, ఆర్థిక వనరులు, శక్తిని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఈ దండయాత్ర కాసిమ్ సాగించాడు. తొలుత ముఖ్యమైన రాజా దాహిర్ ఓడించి, ఆయన రాజధాని అలోర్ (ప్రస్తుత పాకిస్తాన్‌లోని సుక్కూర్ ప్రాంతం)ను తన అధీనంలోకి తీసుకున్నాడు. సింధు నదీ లోయలో అరబ్బులు తొలిసారి అడుగుపెట్టారు. ముస్లిం పరిపాలన, ఇస్లాం మతం ప్రవేశానికి ఇదే ఆరంభం.


కశ్మీర్ వివాదం


భారత ఉప-ఖండంలో 1947లో బ్రిటిష్ వలస పాలన ముగిసింది. పోతూపోతూ బ్రిటిషర్లు దేశాన్ని రెండు ముక్కలుగా చేశారు. భారత్, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలోని 562 సంస్థానాలు ఉండేవి. స్వాతంత్య్రం సమయంలో ఈ సంస్థానాలకు మూడు ఎంపికలు ఇచ్చారు: 1. భారతదేశంతో కలవడం. 2. పాకిస్తాన్‌తో కలవడం. 3. స్వతంత్రంగా ఉండటం. అయితే, కేవలం మూడు సంస్థానాలు తప్పా మిగతావి బేషరుతుగా భారత యూనియన్‌లో విలీనమయ్యాయి. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన, ఆయన సెక్రటరీ వి.పి. మీనన్ కలిసి సంస్థానాధిపతులను ఒప్పించి, చాలా వరకు చర్చల ద్వారా విలీనం జరిగింది.


పహల్గావ్‌లో టూరిస్ట్‌ల కోసం ఉగ్రవాదులతో హార్స్ రైడర్ వీరోచిత పోరాటం


కానీ, హైదరాబాద్, జమ్మూ కశ్మీర్, జునాగఢ్ విలీనం కాలేదు. హైదరాబాద్‌ను పాలించే నిజాం స్వతంత్రంగా ఉండాలి కోరుకున్నాడు. చివరికి 1948లో ‘పోలీస్ యాక్షన్’ (ఆపరేషన్ పోలో 1948) ద్వారా హైదరాబాద్ విలీనం చేశాడు. జునాగఢ్ నవాబు పాకిస్థాన్‌తో కలవాలనుకున్నాడు. కానీ భారత్‌లో చేరాలన్న ప్రజల ఒత్తిడితో విలీనానికి తలొగ్గాడు..


కానీ, జమ్మూ కశ్మీర్ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ తటస్థంగా ఉండాలని భావించారు. కానీ, ఊహించని రీతితో పాకిస్థాన్ దాడి తర్వాత మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీన పత్రంపై సంతకం చేశారు. ఇది కశ్మీర్ సమస్యకు మూలకారణమైంది.


దాయాదుల మొదటి యుద్ధం


దీని ఫలితంగా విభజన జరిగిన ఏడాదికే భారత్-పాకిస్థాన్ మధ్య మొదటి యుద్ధం జరిగింది (1947-48).ఆ యుద్ధం తర్వాత కశ్మీర్‌లో కొంత భాగం భారత్‌లో ఉండిపోగా.. మరికొంత పాకిస్థాన్ ఆక్రమించుకుంది. ఇదే ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్. భారతదేశం పాలనలో జమ్మూ, కశ్మీర్, లడఖ్, పాక్ పాలనో అజాద్ కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్.. అక్సాయ్ చిన్‌‌ను చైనా ఆక్రమించుకుంది. కశ్మీర్‌ మొత్తాన్ని తన భూభాగంగానే భారత్ భావిస్తోంది. కానీ, కశ్మీర్‌పై పాక్ కూడా హక్కు కోరుతుంది. కశ్మీర్ ప్రజల్లో కొంతమంది స్వతంత్రతను కోరుకుంటున్నారు. అనేక యుద్ధాలు (1947, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం) జరిగినా సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సరిహద్దుల్లో నిరంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com