ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్ల తర్వాత మానసరోవర యాత్ర పునఃప్రారంభం,,,రెండు మార్గాల్లో మొత్తం 750 మందికి అవకాశం

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:17 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 నుంచి నిలిచిపోయిన టిబెట్ సరిహద్దుల్లోని కైలాస మానసరోవర యాత్ర ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభం కానుంది. జూన్ 30న మానసరోవర యాత్ర ప్రారంభమవుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. జూన్ చివరి నుంచి ఆగస్టు మధ్య జరిగే ఈ యాత్రకు.. సుమారు 750 యాత్రికులను అనుమతిస్తామని తెలిపింది.. మొదటి బ్యాచ్ యాత్రికులు జూన్ 30న ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు, గతంతో పోలిస్తే కొన్ని వారాల ఆలస్యంగా యాత్ర ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. 1981లో భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా ప్రారంభమైన ఈ యాత్రనను 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా చైనా ప్రభుత్వం నిలిపివేసింది. తరువాత గల్వాన్ లోయ ఘటనలతో ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలతో యాత్ర తిరిగి ప్రారంభించలేదు.


అయితే, 2024 అక్టోబర్‌లో భారత-చైనా సైనిక బలగాల ఉపసంహరణ ఒప్పందం జరిగినప్పటికీ ఇంకా ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. మానసరోవర్ యాత్ర పునఃప్రారంభం భారత-చైనా సంబంధాల పునరుద్ధరణకు సంకేతం. నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం, వీసాల మళ్లీ మంజూరు, మీడియా, నిపుణుల మార్పిడి వంటి ఇతర చర్యలు కూడా చర్చల దశలో ఉన్నాయి. భారత-చైనా సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమాలు కూడా దీనిలో భాగం.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య గత ఏడాది కజాన్‌ వేదికగా సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ జనవరిలో బీజింగ్‌లో చేసిన పర్యటనలో యాత్ర పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత, భారత్ చైనా సరిహద్దు వర్కింగ్ వ్యవస్థ వంటి వేదికలపై లాజిస్టిక్స్ విషయాలపై పలు చర్చలు సాగాయి.


రెండు మార్గాల్లో 750 యాత్రికులు


జూన్ నుంచి ఆగస్టు మధ్య జరిగే మానసరోవర యాత్రపై విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం యాత్రికులు రెండు మార్గాల్లో ప్రయాణించనున్నారు: ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ద్వారా లిపులేఖ్ పాస్, సిక్కిం గ్యాంగ్‌టక్ ద్వారా నాథులా పాస్ నుంచి అనుమతిస్తారు. లిపులేఖ్ మార్గం ద్వారా 50 మంది చొప్పున 5 బ్యాచ్‌లు, నాథులా మార్గం ద్వారా 50 మంది చొప్పున 10 బ్యాచ్‌లు మాసనరోవర్‌కు చేరుకుంటాయి. యాత్రికుల నుంచి ముందుగా దరఖాస్తులను స్వీకరిస్తారు. మొత్తం దరఖాస్తులను పరిశీలించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 19,500 అడుగుల ఎత్తులో ఉండే కైలాస శిఖరానికి చేరుకోవడం అంత సులభతరం కాదు. అందుకు తగిన ఫిట్‌నెస్, ఆరోగ్యం ఉండాలి. యాత్రికులు ఫిట్‌నెస్ పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది.


వెబ్‌సైట్‌లో దరఖాస్తు, టిక్కెట్ వివరాలను పొందుపరిచారు. లిపులేఖ్ ద్వారా వెళ్తే రూ.1.74 లక్షలు, నాథులా కనుమ గుండా అయితే రూ.2.83 లక్షలు ఛార్జీలు వసూలు చేస్తారు. సీనియర్ సిటిజన్లకు నాథులా అనుకూలమైన మార్గం. ఇక్కడ నుంచి రవాణా సౌకర్యాలు ఉంటాయి. విమాన ఛార్జీలు, వసతికి ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. అందుకే లిపులేఖ్ కంటే నాథులా కనుమ మార్గంలో ఖర్చు దాదాపు రూ.లక్ష అదనంగా ఉంటుంది. ఈ రెండు మార్గాల్లోనూ యాత్ర పూర్తికావడానికి మూడు వారాలు పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com