ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల రాజీనామా!

international |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:18 PM

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఉద్రిక్తతలు తీవ్రమై.. యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తుండటం.. దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టేలా చేస్తోంది. ఇప్పటికే భారత్‌తో పోల్చితే.. సైన్యంలో, ఆయుధ పరంగా చాలా రెట్లు తక్కువగా ఉన్న పాక్.. ఇప్పుడు ఉన్న సైనికులు, ఉన్నతాధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో సైన్యం మోహరింపును పెంచాయి. ఉగ్రదాడి ఘటనకు కారణమైన పాకిస్థాన్‌‌కు షాకిచ్చేలా.. సింధు జలాల ఒప్పందం సహా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది. దీనికి బదులుగా సిమ్లా ఒప్పందంతోపాటు.. భారత్‌తో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను పాకిస్థాన్ సస్పెండ్ చేసింది. దీంతో కశ్మీర్లో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినట్లయ్యింది. దీంతో పాక్ సైన్యం భారత చెక్‌పోస్టులపై కాల్పులకు తెగబడుతూ యుద్ధానికి కాలు దువ్వుతోంది.


ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలో కొందరు అధికారులు, జవాన్లు రాజీనామా చేశారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పాక్ సైన్యంలో రాజీనామాలు పాక్ సర్కార్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. కొన్ని సోషల్ మీడియా కథనాల ప్రకారం.. పాక్ సైన్యంలోని కొందరు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే వారు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


250 మందికిపైగా సైనిక అధికారులతోపాటు 1200 మంది సైనికులు కూడా రాజీనామా చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ద్వారా తెలుస్తోంది. అయితే జవాన్లు, అధికారులు రాజీనామా చేశారనే వార్తలపై ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం గానీ, పాక్ సర్కార్ గానీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. కానీ ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైతే.. భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ సైన్యానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇక ఇప్పటికే ఒకవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ సైన్యంపై, షెహబాజ్ షరీఫ్ సర్కార్‌పై గుర్రుగా ఉంది. తరచూ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు చేస్తూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఒకరోజు తర్వాత కూడా పాకిస్తాన్‌ సైన్యం వెళ్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో ఏకంగా 10 మంది పాక్ సైనికులను హతమార్చింది. ఓవైపు.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ సైన్యానికి కొరకరాని కొయ్యగా మారిన వేళ.. ఇటు భారత సైన్యం కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక అయోమయంలో ఉన్న పాక్ సైన్యానికి.. ఇప్పుడు రాజీనామాల అంశం మింగుడు పడటం లేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com