ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 10:01 PM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడి జరిగినప్పటి నుంచి లష్కరే చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ ప్రభుత్వం భద్రతను భారీగా పెంచింది. గతంలో కంటే నాలుగు రెట్లు అధికంగా భద్రత కల్పించడంతో పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై తేటతెల్లమవుతోంది. ఉగ్రదాడికి, హఫీజ్ సయీద్‌కు సంబంధం ఉందనే కోణంలో భారత నిఘా వర్గాలు దృష్టి సారించాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దుచేస్తే... నీళ్లు ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామని హఫీజ్ బెదిరింపులకు దిగాడు


లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, లష్కరే ముఠా నిరంతరం కాపలా కాస్తున్నాయి. అతడి కదలికలను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు, ఇంటి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


సామాన్య ప్రజలెవరినీ హఫీజ్ సయీద్ ఇంటి దగ్గరకు అనుమతించడం లేదు. ఆర్మీకి చెందిన డ్రోన్లు తప్ప ఇతర డ్రోన్లను ఆ ప్రాంతంలో నిషేధించారు. పహల్గామ్ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)’ ముష్కరులు ఉన్నట్టు చెబుతున్నా... దీని వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే అతడికి పాక్ ప్రభుత్వం భద్రత పెంచింది. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా హఫీజ్‌కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇటీవల సయీద్ అనుచరుడు అబు ఖతార్‌ను పాక్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అనుచరుడికి పట్టిన గతే హఫీజ్ సయీద్‌‌కు పడుతుందని నిపుణులు హెచ్చరించారు.


గతంలో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్‌లోని అబోట్టాబాద్‌లో జనావాసాలకు దూరంగా ఉన్న రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. మసూద్ అజార్ వంటి ఉగ్రనేతలు బవహల్‌పూర్‌ పర్వతాల్లో దాక్కున్నారు. కానీ హఫీజ్ సయీద్ మాత్రం జనాల మధ్య ఉంటున్నాడు. దీనివల్ల దాడులు చేస్తే సాధారణ ప్రజలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో పాక్ ఇలా చేస్తోంది. ఇది పాక్ కుట్రపూరిత ఆలోచన అని తెలుస్తోంది.


ఇక, ముంబయి 26/11 ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ కోసం భారత్‌తో పాటు అమెరికా కూడా వెదుకుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్‌ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో సయీద్ ఫొటోను పోస్ట్ చేస్తూ,‘పాకిస్థాన్‌కు ఎంతో విలువైన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటాం’ అంటూ హెచ్చరించింది.


పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో సురక్షితంగా ఉన్న హఫీజ్.. ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతు కేసుల్లో దోషిగా తేలి మొత్తం 46 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడు. 2022 ఏప్రిల్ 7న వెలువడిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. అతడికి రెండు కేసుల్లో 31 ఏళ్ల శిక్ష ఖరారయ్యింది. దీనికి అదనంగా, 2020లో సమానమైన ఆరోపణలపై మరో 15 సంవత్సరాల శిక్ష విధించారు. ఈ శిక్షలు అన్నీ ఒకేసారి అమలులోకి వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa