ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం పిటిషన్‌లపై సుప్రీం ఫైర్

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 09:55 PM

ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో మొత్తంగా 26 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. దీనిపై న్యాయ విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలు తీసుకు వస్తూ.. భారత బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అంతేకాకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలోకి.. ఏప్రిల్ 22వ తేదీన సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారు. ఆపై పురుషులు, ముస్లింకాని వాళ్లనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది గాయపడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడగా.. ముష్కరులను పట్టుకునేందుకు భారత సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించి.. భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది.


ఇలా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా.. ఉగ్రదాడికి పాల్పడిన వారికి, దీనికి మద్దతిచ్చిన వారికి గట్టి బదులు ఇస్తామనిభారత్ చెబుతూ వస్తోంది. ఈక్రమంలోనే ఓ వ్యక్తి పహల్గాం దాడిపై న్యాయ విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు అత్యున్నత న్యాయస్థానం దాన్ని పరిశీలించి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా క్లిష్ట సమయం అని.. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలని సూచించింది. ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని.. అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని వివరించింది. ఇంతటితో ఆగకుండా ఇలాంటి చర్యలతో మన బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకుంటున్నారా అని కూడా పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది.


మీకు కూడా దేశం పట్ల బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని పిటిషనర్‌కు గుర్తు చేసింది. అలాగే ఇలాంటి అంశాలను వీలనైంత వరకు న్యాయ పరిధిలోకి తీసుకురాకూడదని సూచించింది. ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారని అత్యున్నత న్యాస్థానం పేర్కొంది. ఈక్రమంలోనే పిటిషన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ పిటిషన్ వేసినట్లు చెప్పగా.. విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లాల్సిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఈ వ్యాజ్యాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించగా.. పిటిషనర్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa