ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్టర్ సహా ఆరుగురు కార్మికులను కాల్చి..పహల్గాంకు ముందు మరోచోట ఉగ్రవాదుల దాడి

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 09:55 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మొత్తంగా 26 మంది ప్రామాలు తీశారు. అయితే ఈ దాడికి ముందే నిందితులు మరోచోట కూడా దాడికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గతేడాది అక్టోబర్ నెలలో గండేర్‌బాల్ జిల్లా టన్నెల్‌లో ఆరుగురు కార్మికులు, ఓ వైద్యుడిపై కాల్పులు జరిపి చంపినట్లు తెలుసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు గతంలో మరో చోట దాడికి పాల్పడ్డారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో జమ్ము కశ్మీర్‌లోని గండేర్‌బాల్ జిల్లా సోన్‌మార్గ్‌లోని జెడ్‌మోర్ సొరంగం ప్రాజెక్టు వద్ద ఉగ్రదాడి జరిగిందని చెప్పారు. ప్రైవేట్ నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్మిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని వివరించారు. ఈ ఘటనలో ఓ డాక్టర్ సహా ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆ కంపెనీకి చెందిన రెండు వాహనాలను కూడా ఉగ్రవాదులు తగుల బెట్టినట్లు స్పష్టం చేశారు.


మొత్తంగా నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు..!


దాడి అనంతరం ఉగ్రవాదులకు సంబంధించిన ఓ ఇన్‌పాస్ రైఫిల్‌ను సంఘటనా స్థలంలోనే వదిలి వెళ్లినట్లు కూడా నిఘా వర్గాలు వివరించాయి. ముఖ్యంగా ఈ ఘటనలో మొత్తంగా నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని.. అయితే ఇందులో ఒకడైన జునైద్ అహ్మద్ భట్‌ను అదే ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఆ గ్రూపునకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా ఆ తర్వాత కొంత కాలానికే హతమార్చినట్లు స్పష్టం చేశారు. అయితే ఒకడు మాత్రం అప్పుడు తప్పించుకున్నాడని.. అతడి పేరే హషీం ముసా అలియాస్ సులేమాన్ అని చెప్పారు.


లష్కరే తోయిబా గ్రూపునకు చెందిన ఉగ్రవాది హషీం ముసా అలియాస్ సులేమాన్.. టన్నెల్‌లో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించినట్లు నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. అలాగే ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలోనూ ఈయన కీలక వ్యక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత ముష్కరుల ఊహా చిత్రాలు విడుదల చేసి వారి హిస్టరీని బయటకు తీస్తుండగా.. రోజుకో రకమైన విషయం వెలుగులోకి వస్తోంది. చూడాలి మరి ఇంకా వీరు చేసిన ఎన్నెన్ని అరాచకాలు బయటకు వస్తాయనేది. ఎప్పుడు భారత బలగాలకు పట్టుబడి ప్రాణాలు కోల్పోతారనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa