ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి,,,రూ. లక్షను 8 లక్షలు చేసిన స్కీమ్

business |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 11:42 PM

మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందవచ్చని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. గతంలో అనేక మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను అందించాయి. అదే బాటలో, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా తన ఇన్వెస్టర్లకు గొప్ప రాబడిని అందించింది. కేవలం రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, అది ఇప్పుడు దాదాపు రూ. 8 లక్షల వరకు పెరిగిపోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రధాన కారణం "కాంపౌండింగ్' లేదా చక్ర వడ్డీ శక్తి. మీరు మీ పెట్టుబడిపై పొందిన రాబడిని తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ రాబడి కూడా తదుపరి కాలంలో రాబడిని ఉత్పత్తి చేస్తుంది.


ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ వడ్డీపై వడ్డీ వస్తుంది. ప్రతి ఏటా వడ్డీ అసలుకు కలిసి.. దానిపై మళ్లీ వడ్డీ వస్తుంటుందన్నమాట. ఇలా కాలక్రమేణా, ఈ ప్రభావం మీ సంపదను గణనీయంగా పెంచుతుంది. అందుకే, తొందరపడి లాభాలు తీసేయకుండా, ఎక్కువ కాలం వేచి ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఫలితాలను ఇస్తాయి.


పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్.. 2013, మే 24న ప్రారంభమైంది. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ప్రత్యేకత ఏమిటంటే, ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి కేటాయింపు నిష్పత్తిని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించగలదు. ఈక్విటీ సహా ఈక్విటీ సంబంధిత సాధనాలలో మొత్తం ఎక్స్‌పోజర్ 65 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.


ఈ ఫండ్ గత రాబడులను పరిశీలిస్తే..


1 సంవత్సరం: రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 1.13 లక్షలు అయింది (13.85% రాబడి)


3 సంవత్సరాలు: రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 1.59 లక్షలు అయింది (సంవత్సరానికి 16.88% రాబడి)


5 సంవత్సరాలు: రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 3.75 లక్షలు అయింది (30.35% రాబడి)


10 సంవత్సరాలు: రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 4.8 లక్షలు అయింది (సంవత్సరానికి 17.07% రాబడి)


ప్రారంభం నుంచి (మే 24, 2013): రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 7.89 లక్షలు అయింది (సంవత్సరానికి 19.04% రాబడి)


పైన చూసినట్లుగా, ఎవరైనా ఈ ఫండ్‌లో ప్రారంభంలో 2013లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, వారి పెట్టుబడి ఇప్పుడు రూ. 7.89 లక్షలకు చేరుకుని ఉండేది.


2025, మార్చి 31 నాటికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ. 93,440 కోట్ల నికర ఆస్తుల్ని కలిగి ఉంది. దీని బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 500. ఈ పథకాన్ని రాజీవ్ ఠక్కర్, రౌనక్ ఓంకార్, రాజ్ మెహతా, రుకున్ తారాచందాని, మన్సీ కారియా నిర్వహిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఐటీసీ, మారుతీ సుజుకీ వంటి ప్రముఖ స్టాక్స్ ఈ ఫండ్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోల్లో ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa