భారత ఆర్థిక చరిత్రలో ఇదొక మైలురాయి. 2025 ఏప్రిల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త శిఖరాలను తాకాయి. ఊహకు అందని విధంగా ఏకంగా రూ. 2.37 లక్షల కోట్ల జీఎస్టీ.. ఖజానాకు చేరింది. 2017 జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి.. ఇప్పటివరకు ఒకే నెలలో ఇంత భారీ మొత్తం వసూలు కావడం ఇదే ప్రథమం. ఈ క్రమంలోనే.. గత ఏడాది ఏప్రిల్లో నమోదైన రూ. 2.10 లక్షల కోట్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు నెల అంటే 2025 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది దేశవ్యాప్తంగా వస్తువులు, సేవల సరఫరాపై విధించే ఒకే పన్ను. గతంలో ఉన్న అనేక పరోక్ష పన్నులను ఏకీకృతం చేస్తూ ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
ఏప్రిల్ నెలలో నమోదైన మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1.9 లక్షల కోట్లు. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 10.7 శాతం అధికం. ఇక దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం ఏకంగా 20.8 శాతం పెరిగి రూ. 46,913 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్లో రూ. 27,341 కోట్ల రిఫండ్లు జారీ చేసిన తర్వాత కూడా నికర జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం వృద్ధితో రూ. 2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక్కడ ముఖ్యంగా అమెరికా పరస్పర సుంకాల్ని ప్రకటించే ముందు అక్కడి మార్కెట్కు ఎగుమతులు భారీగా వెళ్లగా.. ఇది జీఎస్టీ వసూళ్లపై సానుకూల ప్రభావం చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జీఎస్టీ వసూళ్లు అమల్లోకి వచ్చిన తొలి నెలలో రూ. 92 వేల కోట్లుగానే నమోదయ్యాయి. ప్రారంభంలో కొన్ని రకాల సవాళ్లు ఎదురైన తరుణంలో ఆ ఏడాది అంతటా ఇదే రీతిన జీఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 2018 ఏప్రిల్ నెలలో మొదటిసారిగా వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్కును దాటేశాయి. ఇక మళ్లీ కరోనా నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు రెండు సంవత్సరాల పాటు నెమ్మదించాయి. తర్వాత మళ్లీ 2022 ఏప్రిల్ నెలలో రూ. 1.67 లక్షల కోట్లు వసూలయ్యాయి. అక్కడి నుంచి ప్రతి నెలలోనూ రూ. 1.50 లక్షల కోట్ల మార్కుపైనే నమోదవుతూ వస్తున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటాయి. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు అదే రికార్డు బద్దలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa