ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుల మరణాలకు మంత్రులు బాధ్యత వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 10:50 AM

సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఏడుగురు భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని శానసమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైలెవల్ కమిటీ పేరుతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన అయిదుగురు మంత్రులు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మరణాలకు ఈ మంత్రులే బాధ్యత వహించాలని అన్నారు. అయన మాట్లాడుతూ.... సింహాచలం చందనోత్సవం నాడు లక్షలాధి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు సింహాచలంకు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేస్తుంటుంది. జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల సమన్వయంతో అన్ని వసతులు, భద్రత కల్పిస్తుంటారు. ప్రతిఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఏడుగురు దుర్మరణం పాలవ్వడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ సంఘటన జరిగింది. ప్రచార ఆర్భాటంపై చూపించే శ్రద్ద, భక్తుల భద్రతపై చూపించలేదు. బాధ్యతలను పక్కకుపెట్టి, వీఐపీల సేవకే అధికారులు పరిమితం అయ్యారు. భక్తులు ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఎలా చేయాలి, భక్తుల రద్దీని ఎలా క్రమబద్దీకరించాలి, గతంలో చేసిన ఏర్పాట్ల కన్నా మెరుగైన చర్యలు చేపట్టాలనే ఆలోచనే చేయలేదు. ఏడుగురు చనిపోయిన దుర్ఘటన జరిగిన విషయం తెలియగానే మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ హుటాహుటిన విశాఖకకు వచ్చి, బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. పార్టీ పరంగా రెండు లక్షల రూపాయలు పరిహారంగా అందించారు. బాధిత కుటుంబాలు కోరుతున్నట్లుగా వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం వంటి బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు స్పందించలేదు. కానీ ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ బాధ్యతతో వ్యవహరించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఆత్మస్థైర్యం కల్పించారు అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa