ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఐరన్ స్క్రాప్ తో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 04:01 PM

ఏపీ రాజ‌ధాని అమ‌రాతి ప‌నుల పునఃప్రారంభం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమ‌రావ‌తి ప‌నుల‌ను లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో వ్యర్థ ఇనుము (ఐరన్ స్క్రాప్)తో రూపొందించిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఈ కళాఖండాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెనాలికి చెందిన ప్రముఖ స్క్రాప్ ఆర్టిస్ట్ కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన బృందం ఈ విగ్రహాలను తీర్చిదిద్దారు.మెకానిక్ షెడ్లలో, ఇతర ప్రాంతాలలో వృధాగా పడేసిన పాత నట్లు, బోల్టులు, ఇనుప ముక్కలు వంటి స్క్రాప్ మెటీరియల్‌ను సేకరించి, వాటితో ఎంతో నైపుణ్యంగా ఈ శిల్పాలను రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహంతో పాటు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ప్రతిమను ఆకట్టుకునే రీతిలో తయారుచేశారు. వీటితో పాటు అమరావతిని సూచించే బుద్ధుడి విగ్రహం, దాని వెనుక ధర్మచక్రం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రతీకగా నిలిచే సింహం బొమ్మను కూడా స్క్రాప్‌తోనే అద్భుతంగా తీర్చిదిద్దారు."అమరావతి పునః నిర్మాణం 2-5-2025" అనే అక్షరాలను కూడా పాత ఇనుప సామాగ్రితో కళాత్మకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల చిత్రాలను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించి ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా కళాకారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, "ప్రధానమంత్రి అమరావతి పునః నిర్మాణ పనుల కోసం వస్తున్నారని తెలిసిన వెంటనే, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైనా ఒక ప్రత్యేక కళాఖండాన్ని అమరావతిలో ప్రదర్శించాలని భావించాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాల తయారీలో మాకు మంచి గుర్తింపు ఉంది, అందుకే ఈ మాధ్యమాన్నే ఎంచుకున్నాం" అని తెలిపారు. గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై వంటి నగరాల నుంచి స్క్రాప్‌ను సేకరించినట్లు ఆయన వివరించారు. సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక రైతులు కూడా ఈ కళాఖండాలను చూసి ముగ్ధులయ్యారని, వీటిని శాశ్వతంగా అమరావతిలోని ఏదైనా కూడలిలో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వెంకటేశ్వరరావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa