ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇద్దరు పాకిస్థానీ జర్నలిస్టులు హద్దులు దాటి బూతులతో రెచ్చిపోయారు

international |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 07:46 PM

లండన్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇద్దరు పాకిస్థానీ జర్నలిస్టులు హద్దులు దాటి బూతులతో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటూ వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. ఈ ఘటన అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్  పార్టీ సెక్రెటరీ జనరల్, ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు సల్మాన్ అక్రమ్ రాజా లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు పాకిస్థానీ జర్నలిస్టులు హాజరయ్యారు. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన నియో న్యూస్ ఛానెల్ ప్రతినిధి సఫీనా ఖాన్, మరో జర్నలిస్ట్ అసద్ మాలిక్ కూడా ఉన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏదో విషయంలో మాటామాటా పెరిగింది.అది కాస్తా శృతిమించి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. సఫీనా ఖాన్, అసద్ మాలిక్ ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అక్కడే ఉన్న ఇతర జర్నలిస్టులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటన అనంతరం సఫీనా ఖాన్ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అసద్ మాలిక్‌తో పాటు టీవీ లండన్‌లో పనిచేస్తున్న మోహ్సిన్ నక్వీ, హమ్ న్యూస్ రిపోర్టర్ రఫీక్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. గతంలో కూడా వీరు తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించారని, అయినా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల మధ్య జరిగిన ఈ గొడవ, అనంతరం వచ్చిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa