ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విలేకరుల సమావేశం నిర్వహించిన దేశాధినేతగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సరికొత్త రికార్డు

international |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 08:38 PM

ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విలేకరుల సమావేశం నిర్వహించిన దేశాధినేతగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సరికొత్త రికార్డు సృష్టించారు. శనివారం జరిగిన ఈ మారథాన్ సమావేశం దాదాపు 15 గంటల పాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం, మధ్యలో ప్రార్థనల కోసం స్వల్ప విరామాలు మినహా ఏకధాటిగా సాగిందని అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. మొత్తం 14 గంటల 54 నిమిషాల పాటు అధ్యక్షుడు ముయిజ్జు విలేకరులతో మాట్లాడారని వారు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సమయంలో ఎక్కువ భాగం అధ్యక్షుడు వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారని అధికారిక వర్గాలు వివరించాయి.ఈ మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌తో, గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పేరిట ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 2019 అక్టోబర్‌లో జెలెన్‌స్కీ ఏకంగా 14 గంటల పాటు విలేకరులతో సమావేశమై అప్పటి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు ముయిజ్జు ఆ రికార్డును తిరగరాశారు.మాల్దీవుల అధ్యక్షులు ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు. 2009లో అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేందుకు హిందూ మహాసముద్రం అడుగున మంత్రివర్గ సమావేశం నిర్వహించి సంచలనం సృష్టించారు. తాజాగా ముయిజ్జు సుదీర్ఘ ప్రెస్ మీట్‌తో మరోసారి మాల్దీవులు వార్తల్లో నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa