హైదరాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ప్యాట్నీ సెంటర్లో ఆదివారం (మార్చి 04న) రోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్యాట్నీ సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భవనంలోని ఐదో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగ, అగ్ని కీలలు భవనం నుంచి ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. భవనం చుట్టూ భారీగా పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు కాస్త ఆటంకం కలుగుతోంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా ప్యాట్నీ సెంటర్లో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలకు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa