పహల్గామ్ ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో వారికి సహకరించిన వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. కుల్గాం జిల్లాలో సైన్యం నుంచి తప్పించుకోడానికి ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి నదిలోకి దూకి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉగ్రస్థావరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, సోమవారం పూంచ్ జిల్లాలో భారీ డంప్ను భద్రతా దళాలు గుర్తించాయి. ఇందులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వినియోగానికి సిద్ధంగా ఉన్న ఐదు ఐఈడీలు (పేలుళ్ల పరికరాలు), వైర్లెస్ సెట్లు, కొన్ని దుస్తులు లభ్యమయ్యాయి.
ఈ ఐఈడీలు సగటున అర కిలో నుంచి ఐదు కిలోల వరకు బరువుండగా, అధికారులు వాటిని సంఘటన స్థలంలోనే నిర్వీర్యం చేశారు. భారీ దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్ర భగ్నమైందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఐఈడీల్లో రెండు స్టీల్ బకెట్లలో ఉండగా, మిగతా మూడు టిఫిన్ బాక్సుల్లో భద్రపరచారని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం ధ్వంసం చేసింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆదివారం కశ్మీర్ ఐజీపీ వీకే బిర్డీ నేతృత్వంలో భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్, కేంద్రా సాయుధ పోలీసు దళాల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం లోయలో ఉన్న భద్రతా సవాళ్లపై చర్చించి సమగ్ర సమాచారం అందించారు.
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల్లో అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, ముఖ్య ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల వద్ద దళాలను మోహరించారు. చిన్న, మధ్య, పెద్ద హోటళ్ల వద్ద భద్రత పెంచారు. ఇక, బైసరన్ లోయలో దాడికి ముందు ఉగ్రవాదులు మూడు చోట్ల దాడులకు రెక్కీ నిర్వహించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
మరోవైపు, ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా భారత్లో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపించడం, అటారి-వాఘా సరిహద్దు మూసివేత, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడం, వాణిజ్య-సాంస్కృతిక సంబంధాల రద్దు వంటివి ఉన్నాయి. ఈ దాడులపై ప్రతీకారం విషయంలో భారత సాయుధ దళాలకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa