ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఊళ్లో 77 ఏళ్లలో తొలిసారి పదో తరగతి పాసైన బాలుడు

national |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 07:36 PM

 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా.. ఆ గ్రామం మాత్రం అస్సలే అభివృద్ధి చెందలేదు. అక్కడుండే పిల్లలంతా బుక్కెడు బువ్వ కోసం రోజంతా కష్ట పడుతూ పని చేస్తున్నారే తప్పా.. చదువుకోవాలని ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎప్పుడూ కుటుంబ సభ్యులు అందరికీ కడుపునిండా భోజనం పెట్టాలని తపించే వాళ్లే తప్ప.. చదువుకుని తమ జీవితాలు బాగు చేసుకోవాలని ఆలోచించిన వాళ్లు లేరు. కానీ తొలిసారి ఓ బాలుడు చదువుతో తన కుటుంబ గతిని మార్చాలనుకున్నాడు. అందుకోసం పగలంతా కష్టపడి పని చేస్తూ రాత్రిళ్లు మాత్రమే చదువుకుని.. పదో తరగతి పాసయ్యాడు. మరి ఈ బాలుడు ఎవరు, అతడి కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్‌లోని నిజామ్‌పూర్ గ్రామంలో దాదాపు 40 ఇళ్లు, 300 మంది వరకూ జనాభా ఉన్నారు. అయితే వీరంతా దళిత వర్గానికి చెందిన వారే కాగా.. అందరి ఆర్థిక పరిస్థితి అంతత మాత్రమే. ఇక్కడి వాళ్లంతా వ్యవసాయం సహా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు అంతా మూడు పుటలా కడుపు నిండా భోజనం చేస్తే చాలు అనుకునే పరిస్థితి. అచ్చంగా ఇలాగే భావించే జగదీశ్, పుష్ప దేవి దంపతులకు నలుగురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడి పేరు రామ్‌కేవల్. ఇతడి తండ్రి దినసరి కూలీగా పని చేస్తుంటే తల్లి ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా విధులు నిర్వహిస్తోంది.


కన్నబిడ్డలందరికీ కడుపు నిండా భోజనం పెడితేనే చాలని భావించే స్థితిలో ఉన్న వీళ్లకు.. 15 ఏళ్ల పెద్ద కుమారుడు కూడా చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. అమ్మానాన్నలతో పాటే కష్టపడుతూ.. తమ్ముళ్ల కడుపు నింపేందుకు కూలీగా మారి పని చేస్తున్నాడు. అయితే తమ కుటుంబ పరిస్థితి మారాలంటే ఇలా కూలీ పనులు చేస్తే సరిపోదని.. చదువుకుంటే ఉద్యోగం సాధించి.. అమ్మానాన్నలను బాగా చూసుకోవచ్చనుకున్నాడు. అందుకోసం తాను కచ్చితంగా 10వ తరగతి పాసవ్వాలనుకున్నాడు.


అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామం నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఎవరూ లేరు. ఇక పైచదవులు మాట దేవుడెరుగు. అంతా ప్రాథమిక పాఠశాల వరకే చదివి కూలీలుగా చేస్తున్నారు. కానీ రామ్‌కేవల్ మాత్రం పట్టుదలతో.. రోజూ రాత్రి 2 గంటలు చదవడం ప్రారంభించాడు. పొద్దంతా పనికి వెళ్లి వచ్చి.. అలిసిపోయినా ఏమాత్రం ఆలోచించకుండా చదువుపై మాత్రమే దృష్టి పెట్టాడు. బడికి వెళ్లలేకపోయినా తానే పాఠాలను చదివి, అర్థం చేసుకుంటూ వచ్చాడు. ఇలా ఇటీవలే పదో తరగతి పరీక్షలు కూడా రాయగా.. ఫస్టు క్లాసులో పాసయ్యాడు.


77 ఏళ్లలో నిజామ్‌పూర్ నుంచి పదో తరగతి పాసైన తొలి వ్యక్తిగా రికార్డు సాధించాడు. మొత్తంగా 600 మార్కులకు గాను 322 మార్కులు సాధించాడు. వచ్చింది తక్కువ మార్కులే అయినా బడికి వెళ్లకుండా.. కేవలం రాత్రిళ్లు మాత్రమే చదివి ఇన్ని మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమే. అది కూడా ఏ ఒక్కరి సాయం లేకుండా ఇదంతా చేయడంతో తల్లిదండ్రులు సహా గ్రామస్థులంతా తెగ సంబుర పడిపోతున్నారు. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ శశాంత్ త్రిపాఠీ.. నేరుగా గ్రామానికి వెళ్లి రామ్‌కేవల్‌ను సత్కరించారు. పై చదువుల్లో ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తానని వివరించారు.


ఈ సందర్భంగానే రామ్‌కేవల్ మాట్లాడుతూ.. తాను పదో తరగతి పరీక్షలు రాస్తుంటే గ్రామంలోని చాలా మంది ఎద్దేవా చేశారని చెప్పుకొచ్చాడు. నీవు అస్సలే పాసవ్వలేవంటూ నిరుత్సాహ పరిచారని, కానీ తనకు మాత్రం తాను కచ్చితంగా ఉత్తర్ణీడుని అవుతాననే నమ్మకం ఉండేదని వివరించాడు. కూలీ పనులతో పాటు వివాహాది శుభకార్యాల్లో జరిగే ఊరేగింపుల్లో లైట్ పట్టుకుని రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు సంపాదిస్తూ.. అమ్మానాన్నలకు సాయంగా నిలిచానని చెప్పాడు. పొద్దుపోయాక పనుల నుంచి ఇంటికి వచ్చిన తాను కచ్చితంగా రోజూ రెండు గంటలు చదివేవాడినంటూ తన విజయ రహస్యాన్ని పంచుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa