ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కాంగ్రెస్ ఎంపీ భార్యకు పాక్ ఆర్మీతో మంచి సంబంధాలు.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

national |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 07:54 PM

భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగొయ్ లక్ష్యంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయన మరోసారి గౌరవ్ గొగొయ్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే గౌరవ్ గొగొయ్ 15 రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉన్నట్లు హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా గౌరవ్ గొగొయ్ సతీమణిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌ గొగొయ్‌కు పాక్ ఆర్మీతో సత్సంబంధాలు ఉన్నాయని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఎలిజబెత్ కోల్బర్న్ గొగొయ్.. భారత్- పాకిస్తాన్ మధ్య 19 సార్లు ప్రయాణించినట్లు తెలిపారు.


గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ గొగొయ్.. గతంలో పాకిస్తాన్‌లో పని చేసి.. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి.. ఒక ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్నారని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కానీ ఆమె పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటూనే ఉన్నారని అస్సాం సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగోయ్ 15 రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉంటే.. అందులో 7 రోజులు ఆయన భార్య అతడితోనే ఉందని.. ఆ తర్వాత ఆమె భారత్‌కు తిరిగి వచ్చినప్పటికీ.. ఆయన మాత్రం పాకిస్తాన్‌లోనే ఉండిపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్‌లో ఏం చేశారు.. పాక్ ఆర్మీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించారా లేదా అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.


అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో పాకిస్తాన్‌లో పర్యటించిన విషయాన్ని ప్రశ్నించే వారు.. ఆయన ప్రధానమంత్రి హోదాలో అక్కడి వెళ్లిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హితవు పలికారు. కానీ గౌరవ్ గొగోయ్.. ఏ అధికార హోదాలో అక్కడికి వెళ్లారని హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. పాక్ పర్యటన సందర్భంగా గౌరవ్ గొగొయ్‌కి పోలీసులు సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన అలీ తౌకీర్ షేక్.. భారత్‌లోని అతని భాగస్వాముల మధ్య సంబంధాలను గుర్తించేందుకు సిట్ ఏర్పాటు చేశామని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.


గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారంగా నమోదు చేసినట్లు తమ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని అస్సాం సీఎం తెలిపారు. అట్టారీ-వాఘా సరిహద్దుల్లో దీనికి సంబంధించిన వివరాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 90 మంది బాలురు, బాలికలను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారని.. వారిలో చాలామందికి అక్కడికి వెళ్తున్నట్లు తెలియదని చెప్పారని.. ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. పాక్ ఆర్మీ కార్యాలయం, లాహోర్, సింధ్ లేదా ఇతర సున్నితమైన ప్రదేశాలను గౌరవ్ గొగోయ్ సందర్శించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని.. వీటికి ఆయన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌరవ్ గొగొయ్ మాత్రమే భారత పౌరుడు అని.. అతని భార్యకు బ్రిటిష్.. పిల్లలకు వేర్వేరు దేశాల పౌరసత్వం ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa