ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు.. రంగంలోకి రఫేల్, మిరాజ్, సుఖోయ్

national |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 10:22 PM

భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే పాక్ సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేసేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగం సిద్ధం చేస్తోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపడుతుండగా.. మరోవైపు.. అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు విన్యాసాలు చేయనున్నారు. ఇందుకోసం రఫేల్, మిరాజ్, సుఖోయ్ లాంటి ఫైటర్ జెట్లు రంగంలోకి దిగనున్నాయి.


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు(బుధవారం) దేశంలోని దాదాపు 300 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇలాంటి తరుణంలోనే భారత వైమానిక దళం కూడా సన్నద్ధం అవుతోంది. దేశంలో మాక్‌డ్రిల్స్ చేస్తుండగా.. పాక్ సరిహద్దుల్లో భారత వాయుసేన విన్యాసాలు జరపనుంది. రాజస్థాన్‌లోని ఇంటర్నేషనల్ బోర్డర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలకు చేసేందుకు సిద్ధమైంది. ఈ విన్యాసాలకు సంబంధించి ఐఏఎఫ్ పైలట్లకు ఇచ్చే సమాచారం NOTAMను భారత వాయుసేన జారీ చేసింది.


ఈ క్రమంలోనే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య అంతర్జాతీయ సరిహద్దులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బుధవారం మాక్‌ డ్రిల్స్‌ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సైనిక విన్యాసాల్లో రఫేల్‌, మిరాజ్‌ 2000, సుఖోయ్‌-30 వంటి అన్ని రకాల ఫైటర్ జెట్లు పాల్గొననున్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. దాదాపు ఐదున్నర గంటలపాటు ఈ ఐఏఎఫ్ ఫైటర్ జెట్ల యుద్ధ విన్యాసాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలను పూర్తిగా రద్దు చేయనున్నారు.


ఇక ఇప్పటికే ఒకవేళ పాక్ దాడులు చేస్తే.. సురక్షితంగా ప్రాణాలు కాపాడుకునేందుకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీనికోసం దేశవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. వైమానిక దాడులు, బాంబు దాడులు జరిగితే వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో అనేది ప్రజలు, విద్యార్థులకు తెలియజేయనున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఈ మాక్ డ్రిల్స్‌ చేపడతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa