అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టింది. 2016 నాటి యూరి ఘటన అనంతరం జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడుల శైలికి ఇది పూర్తిగా భిన్నమైనది. వ్యూహాత్మకంగా, సాంకేతికంగా అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ ఇది. ఈ చర్య ద్వారా ఉగ్రవాదం విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకుందని, మరింత కఠినంగా వ్యవహరిస్తుందనే స్పష్టమైన సంకేతాన్ని పాకిస్థాన్కు పంపినట్లయింది.ఈ ఆపరేషన్ ద్వారా భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమవ్వడంతో, ఉగ్రవాద సంస్థల నెట్వర్క్లకు, వాటిని నడిపించే సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు వెళ్లినట్లుగా చెప్పవచ్చు. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించడానికి భారత్ వెనుకాడదని, లక్షిత దాడులు చేయగల సత్తా తమకుందని ఈ ఆపరేషన్ ద్వారా నిరూపితమైంది. ఉగ్రదాడులకు ప్రతిస్పందన కేవలం సైనిక శక్తి ప్రదర్శనకే పరిమితం కాదని, ఉగ్రవాదుల కార్యకలాపాలకు, వారికి లభించే ఇతర వనరుల పునాదులను సమూలంగా పెకిలించి వేస్తామని భారత్ ఈ చర్యతో స్పష్టం చేసినట్లయింది.లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం ఉన్న 24 ఆయుధాలను ఈ ఆపరేషన్లో భారత దళాలు వినియోగించాయి. వీటిలో శక్తివంతమైన క్షిపణులు, బాంబులతో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాల ద్వారా ఏకకాలంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది వరకు గాయపడినట్లు అంచనా.ఈ దాడికి ముందు, భారత ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించారు. ఉపగ్రహ చిత్రాలు, మానవ వనరుల ద్వారా అందిన నిఘా సమాచారం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కమ్యూనికేషన్లను లోతుగా విశ్లేషించి, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే శిక్షణా కేంద్రాలను, కాంప్లెక్స్లను గుర్తించారు. వీటితో పాటు ఆయా సంస్థలకు చెందిన ఆయుధ డిపోలు, బ్రెయిన్ వాషింగ్ కేంద్రాలు, స్లీపర్ సెల్ ప్రణాళికా కేంద్రాలను కూడా నిర్ధారించుకున్నారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై కొన్ని రోజుల పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచారు.ఆయుధాల ఎంపికలో కూడా భారత దళాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు వంటి అధిక కచ్చితత్వం కలిగిన ఆయుధాలతో పాటు, ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఈ ఆపరేషన్లో వినియోగించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో, అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంతో పాటు పలు ఇతర స్థావరాలను నేలమట్టం చేశారు. ఈ బహవల్పూర్ ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రెజిమెంటల్ సెంటర్ కూడా ఉండటం గమనార్హం. పాకిస్థాన్లో అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్లోనే నాలుగు ఉగ్రవాద శిబిరాలను ఈ ఆపరేషన్లో ధ్వంసం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa