ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్‌ సిందూర్‌.. పాకిస్తాన్‌కు మద్దతుగా ఆ రెండు దేశాలు

international |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 09:19 PM

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన భారత్.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులకు దిగింది. పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా పట్టుకుని మట్టిలో కలిపేస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ.. అన్నట్లుగానే పాక్ ఉగ్ర సంస్థలపై స్ట్రైక్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటం చేస్తే ఫుల్ సపోర్ట్ ఇస్తామని ప్రకటించింది. అందుకు అవసరమైన సహాయం కూడా చేస్తామని తెలిపింది. అదే సమయంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌ పట్ల ఏ దేశం కూడా కన్నెత్తి చూడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్‌కు అన్ని దేశాలు మద్దతు పలుకుతుండగా రెండు దేశాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు మద్దతు నిలుస్తున్నాయి. ఆ రెండు దేశాలే టర్కీ, అజర్‌బైజాన్.


పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి.. మెరుపు దాడుల తర్వాత ప్రపంచ దేశాలకు భారత్ సమాచారం అందించింది. పాక్‌లోని సైనిక స్థావరాలు, పౌరులను లక్ష్యంగా దాడులు చేయలేదని.. కేవలం ఉగ్రవాదులు, వారి శిక్షణ శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసినట్లు భారత్ అన్ని దేశాలకు స్పష్టం చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్వయంగా బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ వంటి దేశాల అధికారులతో స్వయంగా మాట్లాడి విషయం చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని చాలా శక్తివంతమైన దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి.


అయితే ఈ విషయంలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోంది. కానీ కేవలం రెండు దేశాలు మాత్రమే పాక్‌కు మద్దతు తెలుపుతున్నాయి. పాక్‌ భూభాగంలో భారత్ చేసిన దాడిని ఖండిస్తూ టర్కీ, అజర్‌బైజాన్ ప్రకటనలు విడుదల చేశాయి. ఆపరేషన్ సిందూర్‌పై ఎక్స్‌లో పోస్ట్ చేసిన టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ.. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాము ఆందోళనతో గమనిస్తున్నామని పేర్కొంది. పాక్‌పై భారత్ జరిపిన దాడి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను తాము ఖండిస్తున్నామని ఆ పోస్ట్‌లో టర్కీ స్పష్టం చేసింది.


మరోవైపు.. అజర్‌బైజాన్ కూడా పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది. హింసను ఖండిస్తూ అజర్‌బైజాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై అజర్‌బైజాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌పై జరిగిన సైనిక దాడులను తాము ఖండిస్తున్నామని.. ఈ దాడుల్లో అనేక మంది పౌరులు చనిపోయారని.. మరికొందరు గాయపడ్డారని పేర్కొంది. పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావంగా, అమాయక బాధితుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అజర్‌బైజాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa