ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్, డీజిల్ కొరతంటూ ప్రచారం.. ఇండియన్ ఆయిల్ క్లారిటీ

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:55 PM

భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అనేక పుకార్లు దర్జాగా షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో.. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత అంటూ ప్రచారం మొదలైంది. ఇది నిజమే అని నమ్మిన జనాలు.. నిజంగా ఇంధన కొరత సంభవిస్తుందేమో అనే ఆందోళనతో పెట్రోల్‌, డీజిల్‌లను ముందే కొని నిల్వ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టారు.


ఈ క్రమంలో దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున క్యూలైన్‌లో నిల్చున్న జనాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్త నిజమేనా.. నిజంగానే దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా అనే ప్రశ్నలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) స్పష్టతనిచ్చింది.


దేశంలో ఇంధన కొరతంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఓసీ స్పందించింది. మన దగ్గర పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఓసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఓసీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా ఒక పోస్ట్‌ చేసింది. "ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఇంధన కొరత లేదు. మా అన్ని అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సమృద్ధిగా అందుబాటులో ఉంది" అని తెలిపింది.


దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ వద్ద ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. ప్రశాంతంగా ఉండి, అనవసరమైన రద్దీని నివారించి మెరుగైన సేవలు అందించడంలో తమకు సాయం చేయమని తెలిపింది. అంతేకాక తమ సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని వెల్లడించింది. వినియోగదారులు అనవసరంగా ఈ ఫేక్ వార్తలను నమ్మి.. కంగారు పడి పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తవద్దని సూచించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు జరిపింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa