ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ సాయం మరిచిన టర్కీ.. మానవత్వం చూపిన మనపై దాడి కోసం పాక్ చేతికి డ్రోన్లు

international |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 09:50 PM

వసుధైక కుటుంబం అనేది భారత్ ఆలోచనా విధానం. మనుషులంతా ఒక్కటే.. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనేది భారత్ అనాదిగా నమ్ముతూ వస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తినా.. ఏ దేశం ఆపదలో ఉన్నా.. వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు వెంటనే రెస్క్యూ కోసం గాల్లోకి ఎగురుతాయి. గంటల వ్యవధిలోనే విపత్తులతో తల్లడిల్లుతున్న ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభిస్తాయి.


2023లో సిరియా, టర్కీ దేశాలు భూకంపంతో వణికిపోయినప్పుడు కూడా భారత్ మానవత్వంతో స్పందించింది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై టర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ.. పాకిస్థాన్‌తో ఇస్తాంబుల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ.. భారత్ సాయం చేయడానికి వెనుకడుగు వేయలేదు. శత్రు దేశానికి మిత్రుడంటే.. మనకు శత్రువు కదా అనే ఆలోచన రానీయకుండా.. ఆదుకోవడానికి రంగంలోకి దిగింది. ఆపరేష్ దోస్త్.. అంటూ స్నేహ హస్తం చాచింది.


2023 ఫిబ్రవరిలో.. టర్కీలో భూకంపం వచ్చిందని తెలియగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 12 గంటలలోపే సహాయక చర్యలు ప్రారంభించింది. C-17 విమానాల ద్వారా 250 మందికి పైగా సిబ్బంది, 135 టన్నుల పైగా సహాయక సామగ్రిని టర్కీకి పంపింది. ఎయిర్‌‌ఫోర్స్ మాత్రమే కాకుండా.. భూకంప బాధితుల రెస్క్యూ కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, డాగ్ స్క్వాడ్‌ను సైతం భారత్ టర్కీకి పంపించింది.


ఇస్కెందెరున్, హటాయ్ ప్రావిన్స్‌లో భారత సైన్యం 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది.ఈ హాస్పిటల్‌లో మెడికల్, సర్జరీతోపాటు అత్యవసర విభాగాలు, ఎక్స్-రే ల్యాబ్, మెడికల్ స్టోర్‌ను ఏర్పాటు చేసి 24x7 సేవలు అందించింది. రూ.7 కోట్ల విలువైన ఔషధాలు, వైద్య పరికాలను సైతం భారత్ టర్కీకి పంపింది. మన ఆర్మీ డాక్టర్‌ బీనా తివారిని ఓ టర్కీ మహిళ ఆత్మీయంగా ముద్దాడుతూ.. తన అభిమానాన్ని చాటుకున్న దృశ్యాలు.. భారత్ టర్కీ ప్రజలకు ఎంత గొప్ప సేవ చేసిందనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. దీంతో థ్యాంక్యూ హిందుస్థాన్ అంటూ టర్కీ ప్రజలు భారత్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాదు గరుడ ఏరోస్పేస్ తయారు చేసిన డ్రోన్లను సైతం భారత్ టర్కీకి పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి ‘డ్రోని’ డ్రోన్లను వాడగా.. ఔషధాలు, ఆహారం సరఫరా చేయడానికి ‘కిసాన్’ డ్రోన్లు ఉపయోగపడ్డాయి.


అయితే ఇప్పుడు అదే టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత మనతో యుద్ధానికి సై అంటోన్న పాకిస్థాన్‌కు డ్రోన్లను పంపిస్తూ మనపై దాడికి తన వంతు సహకారం అందిస్తోంది. కష్ట సమయంలో అందరి కంటే ముందు స్పందించి.. అండగా నిలిచామనే సోయి లేకుండా.. ఆపన్న హస్తం అందించిన మిత్రుడిపైనే దాడులకు తన మిత్ర దేశాన్ని ప్రోత్సహిస్తోంది. టర్కీ పాకిస్థాన్‌కు డ్రోన్లను పంపించి సాయం చేస్తుందనే విషయం తెలిసి సగటు భారతీయుడు రగిలిపోతున్నాడు. కనీస కృతజ్ఞత లేని ఇస్తాంబుల్ పాలకుల వైఖరి పట్ల ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి భారత పర్యాటకులెవరూ టర్కీకి వెళ్లొద్దని పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ టర్కీ అని నినదిస్తున్నారు. హాలో టర్కీ.. కష్ట సమయంలో మేం చేసిన సాయం మరిచి.. పాకిస్థాన్‌కు అండగా ఉంటారా.. మా భారతీయుల సత్తా ఏంటో మీకు తెలిసేలా చేస్తామని గట్టిగా చెబుతున్నారు-






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa