భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025ని సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించాలని బీసీసీఐ కసరత్తు చేస్తోంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 18న లీగ్ స్టేజ్ మ్యాచ్లు ముగియాల్సి ఉంది. ఫైనల్ మే 25న జరగాలి. కానీ శుక్రవారం నుంచి వారం పాటు లీగ్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడేలా కనిపిస్తుండటంతో బీసీసీఐ లీగ్ పూర్తి చేసేదిశగా అడుగులు వేస్తోంది.
ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు.. జట్లను వీడి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. విదేశీ ప్లేయర్లు సైతం భారత్ను విడిచారు. అయితే ఆటగాళ్లందరూ.. మంగళవారం అంటే మే 13 నాటికి జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విదేశీ ఆటగాళ్లను కూడా భారత్కు రప్పించాలని పేర్కొంది!
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఇంకా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. దీంతో చాలా వరకు డబుల్ హెడర్ మ్యాచ్లు నిర్వహించి వీలైనంత త్వరగా లీగ్ను ముగించాలని ఐపీఎల్ నిర్వహకులు భావిస్తున్నారు. మే 15న లీగ్ను పునఃప్రారంభించి.. మే 30న ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్లందరూ అందుబాటలోకి వస్తే.. ఇంకా త్వరగానే ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది.
“ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంది. స్టేక్హోల్డర్లు, ఫ్రాంఛైజీ యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చించాలి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది” అని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు.
తొలుత మూడు వేదికలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో మిగతా మ్యాచ్లు నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్లా.. మ్యాచ్లు నిర్వహించే అంశంపై కూడా బీసీసీఐ ఆలోచిస్తోందని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్లు తొలి నాలుగు ప్లేసుల్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa