ఐపీఎల్ ఫ్యాన్స్కి ఇది అదిరిపోయే న్యూస్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2025 ఇప్పుడల్లా జరగదని అందరూ ఫిక్స్ అయిపోయిన వేళ భారత్ - పాక్ కాల్పుల ఒప్పందానికి అంగీకరించింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత షెడ్యూల్ ఇస్తారని.. అందుకు కనీసం వారం రోజుల పైనే పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారం లోపే మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలతో తమ తమ దేశాలకు వెళ్లిపోయిన ఫారెన్ ప్లేయర్స్ తిరిగి వస్తున్నారు.
విదేశీ ప్లేయర్లను భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే పనిలో పడ్డాయి ఫ్రాంఛైజీలు. విదేశీ ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ను కూడా వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకు రావడానికి ఆయా ఫ్రాంఛైజీలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్ రేసులో ఉన్న పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీలు ఆయా ప్లేయర్లతో మంతనాలు జరుపుతోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఐపీఎల్ 2025ను అర్ధంతరంగా వాయిదా వేశారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్లాక్ అవుట్ విధించి మ్యాచ్ని నిలిపివేశారు. ఈ మ్యాచ్ తర్వాత నుంచి మరో ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు.
ఐపీఎల్ 2025 పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్తోనే తిరిగి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మ్యాచ్లు మళ్లీ ఎప్పుడు ఉంటాయి అనే అప్డేట్ను బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. తొలుత బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వేదికగా మ్యాచ్లు నిర్వహించాలని ఆలోచించినా.. ఇప్పుడు కాల్పుల విరమణ చేపట్టడంతో అన్ని స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహిస్తారా? లేదా? అనేది చూడాలి.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. టాప్ 4 ప్లేస్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ప్లే ఆఫ్ ఆశలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa