ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ దాడి చేస్తే ప్రతిదాడికి వెనుకాడేది లేదని స్పష్టం చేసిన మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 09:09 PM

భారత్, పాకిస్థాన్ మధ్య సోమవారం జరగనున్న కాల్పుల విరమణ చర్చలకు కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల  ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సంభాషణ, రేపటి చర్చల ప్రాముఖ్యతను మరింత పెంచింది.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రత విషయంలో భారత వైఖరిని జేడీ వాన్స్‌కు నిక్కచ్చిగా తెలియజేశారు. పాకిస్థాన్ వైపు నుంచి ఏదైనా దుందుడుకు చర్య చేపడితే, అందుకు తగిన రీతిలో ప్రతిస్పందించడానికి భారత్ వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. తమ సంయమనాన్ని బలహీనతగా పరిగణించవద్దని, దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా, ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం ఉపేక్షించబోదని ఆయన తేల్చిచెప్పారు.గతంలో కూడా, కశ్మీర్ అంశంపై, ప్రత్యేకించి పాక్ ఆక్రమిత కశ్మీర్  విషయంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వ వైఖరిని అనేకసార్లు స్పష్టం చేశారు. పీఓకే పూర్తిగా భారతదేశ అంతర్భాగమని, ఈ విషయంలో ఎలాంటి చర్చలకు తావులేదని, ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా సూచించారు. పీఓకేను శాంతియుతంగా భారత్‌కు అప్పగించడం ఒక్కటే పాకిస్థాన్‌ ముందున్న మార్గమని మోదీ గతంలోనే దృఢంగా ప్రకటించిన విషయం విదితమే.భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామాల అనంతరం కూడా, పాకిస్థాన్ నుంచి ఎలాంటి దుశ్చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'ను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం సంకేతాలు పంపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa