పహల్గాం ఉగ్రదాడితో భారత్ దాయాది దేశంపై ప్రతీకార చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఆపై పాక్ కూడా ప్రతిదాడులకు పాల్పడగా భారత్ తిప్పికొట్టింది. ఈక్రమంలోనే దాయాది దేశం కాళ్లబేరానికి రాగా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. కానీ ఉగ్రవాదులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పదే పదే చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ భద్రతకు భంగం వాటిల్లేలా చేసే ప్రతి ఒక్కరినీ అంత్యక్రియలకు కూడా పనికిరాకుండా చేస్తామని హెచ్చరించారు. అలాగే ఏదో ఒకరోజు పాకిస్థాన్ను ఉగ్రవాదమే మింగేస్తుందని వివరించారు.
ఆపరేషన్ సిందూర్లో సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రశంసించడానికి యూపీ సీఎం యోగి లక్నోలో భారత్ శౌర్య తిరంగ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్, ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగానే మాట్లాడుతూ సాయిధ దళాల ధైర్యం, త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదం ద్వారా మన శాంతి, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడల్లా భారత సైన్యం పాకిస్థాన్కు తగిన సమాధానం ఇచ్చిందన్నారు. ఉగ్రవాద కేంద్రాలను పూర్తిగా నాశనం చేయడానికి ఆర్మీ ఎంతగానో కష్ట పడిందని గుర్తు చేశారు.
అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో ఒక రోజు ఆ ఉగ్రవాదమే పాకిస్థాన్ను మింగేస్తుందని చెప్పారు. లక్నోలో జరిగిన భారత్ శౌర్య తిరంగ యాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం ఈ కామెంట్లు చేశారు. పాకిస్థాన్ పూర్తి బోలుగా మారిపోయిందని.. ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ దుశ్చర్యలకు సమాధానం అని అన్నారు. భారత్ వైపు వేలు చూపి భద్రతకు భంగం కల్గించే వారిని అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చేసి చంపేస్తామన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్ ఆర్మీ అధికారులను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్లు చేశారు.
పాకిస్థాన్ సైనిక అధికారులు, అగ్రనాయకులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారని యూపీ సీఎం యోగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను ప్రపంచ దేశాలు గమనించాయన్నారు. గత 70 నుంచి 75 ఏళ్లలో పాకిస్థాన్ ఉగ్రవాదానికి బీజం వేసిందని చెప్పారు. అలాగే సాయుధ దళాల స్ఫూర్తిని పెంపొందించడానికి మంగళవారం రోజు పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa