సాధారణంగా భూముల వద్ద తగాదాలు వస్తూ ఉంటాయి. ఈ భూ వివాదాలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ కాళ్లకు ఉన్న చెప్పులు అరిగిపోయినా.. సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఏళ్లకేళ్లు సమయం వృథా కావడమే కాకుండా.. డబ్బులు కూడా భారీగా సమర్పించుకోవాల్సిందే. అయినా ఆ భూమి మనకు వస్తుందో రాదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. దశాబ్దాల తరబడి కోర్టుల్లో వివాదాలు పెండింగ్లో ఉన్న భూములు కూడా ఇంకా పరిష్కారానికి రావడం లేదు. భూ వివాదానికి సంబంధించి ఫిర్యాదు చేసినవారో లేక అవతలి వ్యక్తో చనిపోయినా.. ఆ తర్వాతి తరం వాళ్లు కూడా కోర్టుల చుట్టు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి భూవివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నక్షా కార్యక్రమం కింద.. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను అమలు చేయడమే కాకుండా భూ వివాదాలను కూడా పరిష్కారించేందుకు ఈ నక్షా కార్యక్రమాన్ని నిర్వహించున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తాజాగా వెల్లడించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్పై నిర్వహించిన జాతీయస్థాయి వర్క్షాప్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు.
రాష్ట్రంలోని పట్టణాల్లో పారదర్శక, సమర్థ పాలన కోసం ఈ నక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ నక్షా కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 152 మున్సిపాలిటీల్లో భూసర్వే చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మున్సిపాలిటీలు పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. 9.5 లక్షల ఆస్తులను సర్వే చేసి రికార్డులను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తారు. ఇప్పటికే ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తి అయినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నక్షా కార్యక్రమం పూర్తి అయితే రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదాలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిత్యం భూ తగాదాలతో రెవెన్యూ ఆఫీస్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధలు తప్పుతాయని పేర్కొన్నారు.
![]() |
![]() |