పాకిస్థాన్తో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు నిర్వహించినట్లుగా భావిస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత హిందూ మహాసముద్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చైనాకు చెందిన ‘డ యాంగ్ యి హావో’ అనే గూఢచారి నౌక భారత జలాల సమీపంలో సంచరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం పాకిస్థాన్-చైనా మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.‘ఆపరేషన్ సిందూర్’ జరిగిన వెంటనే చైనా నౌక భారత సముద్ర జలాలకు దగ్గరగా రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సముద్ర గర్భంలో భారత నౌకల కదలికలు, మన నిఘా వ్యవస్థల పనితీరు, ప్రతిస్పందన సామర్థ్యం, ముఖ్యంగా జలాంతర్గాముల కదలికలను పసిగట్టేందుకు చైనా ఈ నౌకను పంపి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌకలో అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలు, సెన్సర్లు ఉన్నాయని, వీటి ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్తో సహా ఇతర భారత యుద్ధ నౌకల కదలికలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో భారత నౌకాదళం అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారత్ మోహరించింది.ఈ గూఢచారి నౌక మోహరింపు వెనుక పాకిస్థాన్కు తమ మద్దతు ఉందని చెప్పడంతో పాటు, కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడమే చైనా ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్లోని కరాచీ వంటి ప్రాంతాలపై ఏదైనా సైనిక చర్యకు సిద్ధమైతే, ఆ సమాచారాన్ని ముందుగానే పాక్కు చేరవేసే వ్యూహంలో భాగంగా కూడా ఈ చర్యను చూడవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ భాగంగా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఈ ప్రాజెక్టును నిర్మించడంపై భారత్ మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సీపెక్ ప్రాజెక్టు పనులు సజావుగా సాగాలంటే పాకిస్థాన్లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఉండటం చైనాకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కూడా చైనా నిఘా కార్యకలాపాలు చేపడుతుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ చైనా నౌక కేవలం నిఘాకే పరిమితం కాకుండా, భారత నౌకాదళ విభాగాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సామర్థ్యం కూడా కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ వ్యూహాల్లో కీలకమైన సబ్మెరైన్ల రాకపోకలను మ్యాప్ చేయగలదని, ఇక్కడ సేకరించిన సమాచారాన్ని భవిష్యత్తులో పాకిస్థాన్లో నిర్మించాలనుకుంటున్న సైనిక లాజిస్టిక్స్ స్థావరం కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా లేకపోలేదని అంచనా.హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలు ఇదే మొదటిసారి కాదు. 2024 సంవత్సరంలో కూడా ‘యువాన్ వాంగ్-6’ వంటి నిఘా నౌకలను చైనా ఈ ప్రాంతంలో మోహరించింది. ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే లక్ష్యంతోనే చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa