పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్ దాయాది దేశంపై దౌత్యపరంగా చర్యలు చేపట్టింది. అలాగే ఆపరేషన్ సిందూర్ నిర్వహించి చుక్కలు చూపించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే కాగా.. ఇటీవలే పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్రను పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్ ద్వారా వివరించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ విషయాలను వివరించాలని ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ఎంపీలను రంగంలోకి దింపబోతుండగా.. అందులో శశిథరూర్, అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్న పాత్రపై న్యూఢిల్లీ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. ముఖ్యంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపి వారికి పరిస్థితులు అర్థమయ్యేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ప్రతి ప్రతినిధి బృందంలో 5 నుంచి ఆరుగురు ఎంపీలు, ఒక విదేశాంగ మంత్రిత్వ శాథ అధికారి ఒక ప్రభుత్వ ప్రతినిధి ఉండనున్నారు. మొత్తం 8 గ్రూపులు 10 రోజుల పాటు 5 దేశాలకు వెళ్తాయి.
అయితే ఈ బృందాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ జాబితాలో ఉన్నారని, ఈయన కూడా కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. ఇతర పార్టీలకు చెందిన నేతలే అయినప్పటికీ వీరు ముందు నుంచి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ చేసే పనులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు. అందుకే వీరికి సర్కారు ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ బృందాలు అన్నీ మే 22వ తేదీన భారతదేశం నుంచి వివిధ దేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడికి వెళ్లిన వీరంతా ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు, పాక్ బెదిరింపులకు దీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్ ఎలా చేపట్టిందో వివరించనున్నారు. అలాగే భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు స్పష్టతను ఇవ్వబోతుంది. అయితే పౌరులకు ఎలాంటి హానీ కల్గజేయలేమని కూడా రుజువు చేయనుంది. ఇవే కాకుండా చాలా ఏళ్లుగా ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాక్.. భవిష్యత్తుల్లో ప్రపంచ దేశాలకు ఎలా ముప్పుగా మారబోతుందో కూడా వివరించబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa