ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ సలహా బోర్డులో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న నేత సహా ఇద్దరు జీహాదిస్ట్‌లు

international |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 08:46 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై యావత్తు ప్రపంచ నివ్వేరపోతోంది. తన సలహా బోర్డులో ఇద్దరు మాజీ జిహాదీ కార్యకర్తలను నియమించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అమెరికా అధినేత నుంచి ఇలాంటిది ఊహించలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు జీహాదిస్ట్‌ల్లో ఒకరు 2000లో పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా శిక్షణా శిబిరానికి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి, అంతేకాదు, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, భారత సైనిక స్థావరాలపై కాల్పుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం వైట్ హౌస్ లే లీడర్స్‌ సలహా బోర్డులో వీరిని నియమించింది.


ఇస్మాయిల్ రోయర్, షేక్ హంసా యూసఫ్ (జయ్తూనా కాలేజీ సహ వ్యవస్థాపకుడు) లు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నవారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, వీరిని బోర్డు సభ్యులుగా నియమించారని ట్రంప్‌ సన్నిహితురాలు లారా లూమర్ ఆరోపించారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్‌ను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించిన లూమర్, రోయర్‌ను సభ్యులుగా నియమించడాన్ని పచ్చి పనిగా ఆమె అభివర్ణించారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం.. రోయర్ ప్రస్తుతం రెలిజియస్ ఫ్రీడమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ఇస్లాం అండ్ రెలిజియస్ ఫ్రీడమ్ యాక్షన్ టీమ్’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.


రెండెల్ రోయర్‌‌గా పిలుచుకునే అతడు 2000లో ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో అమెరికా న్యాయస్థానం 2004లో అతడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ‘వర్జీనియా జిహాదీ నెట్‌వర్క్’లో సభ్యుడిగా ఉన్న రోయర్‌ను ఎఫ్‌బీఐ దర్యాప్తును ఎదుర్కొన్నాడు. అమెరికా మీద యుద్ధం ప్రకటించడానికి కుట్ర, అల్-ఖైదా, లష్కరే-తొయిబాకు సహాయం చేసినందుకు 2003లో కేసు పెట్టింది. 2004లో రోయర్ తన సహచరులను ఆయుధ శిక్షణ శిబిరాలకు పంపడంలో తన పాత్రను అంగీకరించి దోషిగా ఒప్పుకున్నాడు. కానీ, 20 ఏళ్ల శిక్షలో 13 ఏళ్లు మాత్రమే గడిపాడు.


విచారణలో రోయర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మసౌద్ ఖాన్, యోంగ్ కీ క్వాన్, మహ్మద్ అటీక్, ఖ్వాజా మహ్మూద్ హసన్‌లకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే-తొయిబా శిబిరంలో శిక్షణ పొందేందుకు సహాయం చేశాడు. వారు తుపాకులు, ఇతర ఆయుధాలు వినియోగించడంలో శిక్షణ తీసుకున్నారు. అలాగే ఇబ్రాహీం అహ్మద్ అల్-హమ్దీ అనే మరొక వ్యక్తికి ఆ శిబిరంలో ప్రవేశానికి సహకరించి, భారత్‌పై దాడులకు అవసరమైన RPG శిక్షణ పొందేందుకు సాయం చేశాడు.


ఇక, షేక్ హంసా యూసఫ్ కూడా ఉగ్రవాద నేపథ్యం ఉన్న వ్యక్తేనని లూమర్ ఆరోపించారు. వైట్ హౌస్ ప్రకారం.. యూసఫ్ అమెరికాలో మొదటి గుర్తింపు పొందిన ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ జయ్తూనా సహ వ్యవస్థాపకుడు. అదే విధంగా, బర్క్‌లీలోని గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్‌లో ఇస్లామిక్ స్టడీస్ సెంటర్‌కు సలహాదారుగా ఉన్నారు.


‘యూసఫ్ అనే షేక్ హంసా యూసఫ్ నిజమైన జిహాద్ అర్థాన్ని పలుకుతున్న జిహాదిస్ట్. అతడికి హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఆయన స్థాపించిన జయ్తూనా కాలేజీలో షరియత్ చట్టం నేర్పుతారు’ అని లూమర్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa