ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరగాడి వలలో మాజీ ఐఏఎస్.. 3.37 కోట్లు మాయం

Crime |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 08:47 PM

సైబర్ నేరాల, మోసగాళ్ల గురించి పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా.. జనాల చెవికి ఎక్కడం లేదు. ఏదో విధంగా మాయగాళ్ల వలలో పడి.. భారీగా సమర్పించుకుంటున్నారు. మరి ఇలా మోసపోతున్న వారి జాబితాలో కేవలం నిరక్షరాస్యులు, సామాన్యులు మాత్రమే ఉన్నారా అనుకుంటే పొరపాటు. బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం ఏమారుస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారినే బురిడీ కొట్టించాడో సైబర్ నేరస్థుడు. సదరు అధికారి ఖాతా నుంచి ఏకంగా రూ.3.37 కోట్లు ఊడ్చేశాడు. ఆ వివరాలు..


స్టాక్‌మార్కెట్‌లో భారీలాభాలు ఆర్జించొచ్చంటూ సైబర్‌ నేరస్థుడు.. విశ్రాంత ఐఏఎస్‌ను మాయ చేశాడు. అంతేకాక విడతల వారీగా ఆయన బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తూ.. మొత్తంగా రూ.3.37 కోట్లు ఊడ్చేశాడు. సదరు అధికారి.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ హోదాలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌(72) కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడలో నివాసముంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన సెల్‌ఫోన్‌కు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం పేరిట ఒక లింక్‌ వచ్చింది.


పరిచయం పెంచుకుని..


అయితే సదరు అధికారికి ట్రేడింగ్‌ మీద ఆసక్తి ఉండటంతో.. ఆ మెసేజ్‌కు స్పందించాడు. దీంతో సైబర్ నేరగాడు.. తాను కంపెనీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అర్జున్‌ మెహతాను అంటూ.. మాజీ ఐఏఎస్ అధికారితో పరిచయం పెంచుకున్నాడు. ఈక్రమంలో తాము రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో మ్యూచువల్‌ ఫండ్స్, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే లిస్టింగ్‌ సమయంలోనే 120-160 శాతం వరకు లాభాలు పొందొచ్చని సైబర్ నేరగాడు.. అధికారికి ఆశ చూపాడు


బోనస్ డబ్బులు ఇవ్వడంతో నమ్మిన అధికారి..


నేరస్థుడి మాయమాటలు నమ్మిన మాజీ ఐఏఎస్‌ అధికారికి.. సైబర్‌ నేరస్థుడు రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వాట్సప్‌ వీడియోకాల్‌ చేస్తూ షేర్‌మార్కెట్‌ వ్యవహారాలపై సలహాలు ఇస్తుండే వాడు. గ్లోబల్‌ ప్లాట్‌ఫాంపై పోటీపడుతున్న తనకు అనుకూలంగా ఓటు వేయాలని.. అలా చేస్తే తాను నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంటున్నానని తెలిపేవాడు. అంతేకాక సదరు అధికారిని నమ్మించడం కోసం.. తాను ఫస్ట్ ప్లేస్‌కి చేరుకున్నానంటూ.. అప్పుడప్పుడు 5వేలు, 10 వేల రూపాయలు బోనస్‌గా ఇచ్చేవాడు. అలా నెమ్మదిగా సైబర్‌ నేరస్థుడు సదరు మాజీ ఐఏఎస్‌ నమ్మకం సంపాదించాడు.


ఆ తర్వాత తన ప్లాన్ అమలు చేశాడు. సదరు అధికారి తనను పూర్తిగా నమ్మాడని భావించిన తర్వాత.. మోసగాడు.. స్టాక్‌మార్కెట్‌ పెట్టబడుల పేరిట తాను సూచించిన ఖాతాలకు పలుమార్లు నగదు బదిలీ చేయించుకున్నాడు. మార్చి 30 నుంచి మే నెల 13వ తేదీ వరకు.. విడతల వారీగా మొత్తం రూ.3.37 కోట్లను తన ఖాతాలో వేయించుకున్నాడు. ఈ మొత్తం పెట్టుబడికి రూ.22.35 కోట్ల లాభమొచ్చిందని విశ్రాంత ఐఏఎస్‌ వర్చువల్‌ ఖాతాలో చూపించాడు.


భారీ లాభాలు ఆర్జించానని భావించిన ఆ మాజీ ఐఏఎస్ అధికారి.. ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన అధికారి.. పోలీసులు ఆశ్రయించి.. కేసు నమోదు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa