ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లష్కరే తోయిబా ఉగ్రవాదిని నడిరోడ్డుపై కాల్చి చంపిన గుర్తు తెలియని సాయుధులు

international |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:25 PM

భారత్‌లో అనేక ఉగ్రదాడులకు తెగబడిన లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా హతం అయ్యారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో ఉండే ఈయనకు.. ఆ దేశ ప్రభుత్వ భద్రత ఉంది. అయితే మట్లీలోని తన నివాస నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి.. ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడులకు పాల్పడ్డారు. కాల్చి మరీ చంపేశారు. ఈ విషయాన్ని నేరుగా అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి.


అబు సైఫుల్లా భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. అంతేకాదు 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌పై జరిగిన ఉగ్రదాడి, 2001లో రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనకున్న సూత్రధారి కూడా ఈ ముష్కరుడే. ఇన్ని దాడుల్లో పాత్ర వహించిన ఇతడు తాజాగా హత్యకు గురి కావడం గమనార్హం. అందులోనూ ప్రభుత్వ భద్రత ఉండగా.. నడిరోడ్డుపైనే కాల్చి చంపడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.


మార్చి 16వ తేదీ రోజు కూడా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన గార్డుతో కలిసి జీలం ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అబు ఖతల్‌పై 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో అబు ఖతల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో అబు ఖతల్‌తో పాటు తన భద్రతా గార్డు కూడా చనిపోయాడు. మరో గార్డుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో కూడా లష్కర్-ఏ-తోయిబాకే చెందిన కీలక ఉగ్రవాదిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌లో హతమార్చారు.


లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యిద్ బావమరిది మౌలానా ఖషీఫ్ అలీని పాకిస్థాన్‌లోని స్వాబీలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించాడు. వీరితో పాటు భారత దేశంలో ఉగ్రదాడులకు పాల్పడ్డ, ప్రయత్నించిన పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోనే హతమవుతున్నారు. వారందరినీ గుర్తు తెలియని వ్యక్తులే చంపేస్తున్నారు. మరి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com